ఇక్కడ అనేక శతాబ్దాలుగా అసంఖ్యాకమానవులు తమ జీవితాలను ప్రార్థనాగీతాలుగా, హారతిజ్యోతులుగా మార్చేసుకున్నారు. ఏ అతీతకాలంలో పరమశివుడు పార్వతీదేవి చెవిలో ఏ రహస్యసంభాషణ చేశాడోగాని ఆ రహస్యాన్ని ప్రజాస్వామికం చేయడం కోసమే జ్ఞానేశ్వరుడినుంచి సాయినాథుడిదాకా ఒక ఆధ్యాత్మిక ఉద్యమం కొనసాగుతూ వస్తోందనిపించింది.
నేను తిరిగిన దారులు-16
నివృత్తినాథుడి గుహ ఎదుట రాతిగోడకు ఆనుకుని నేను ఆ ముగ్గురు అన్నదమ్ముల్నీ, వాళ్ల చెల్లెల్నీ తలచుకున్నాను. పిల్లల్ని వదలిపెట్టి ఆత్మత్యాగం చేసిన ఆ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకున్నాను. లోకానికి ఇంత వెలుగు పంచిపెట్టిన ఆ కుటుంబం ఎంత విషాదాన్ని అనుభవించిందో ఊహించడానికి ప్రయత్నించాను.
