1987 లో పార్వతీపురం ఐ.టి.డి.ఏ లో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా చేరినప్పుడు అప్పుడు ప్రాజెక్టు అధికారిగా ఉన్న ఏ సుబ్రహ్మణ్యంగారి దగ్గర నా జాయినింగ్ రిపోర్టు ఇచ్చానో ఇప్పుడు ఛీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆ సుబ్రహ్మణ్యంగారిదగ్గరే నా ఐ.ఏ.ఎస్ జాయినింగ్ రిపోర్టు సమర్పించాను. నా ఉద్యోగజీవితంలో ఒక వలయం పూర్తయ్యింది.
మరొకసారి అడవిదారుల్లో
ఆ గిరిజన గ్రామంలో ఆ పెంకుటిళ్ళు, ఆ మట్టి అరుగులు, ఆ పరిశుభ్ర, ప్రశాంత వాతావరణం చూడగానే ఎప్పట్లానే నా మనసు అక్కడే ఉండిపోవాలని కొట్టుకుపోయింది. ఆ అరుగులమీద కూచుని భాగవతమో, బుద్ధుడి సంభాషణలో, స్పినోజా లేఖలో చదువుకోవడం కన్నా జీవితంలో ఐశ్వర్యమేముంటుంది అనిపించింది.