జీవన శిల్పి-7

గురూజీ తమ ఆశ్రమం గురించి చెప్తున్నారు: ‘డక్కలి గోపాల్  మొదలుకుని అందరి వ్యవస్థా ఈ ఆశ్రమం చూసుకుంటుంది. ఎందుకంటే మానసికంగా ఇబ్బంది పడే ప్రజలు కూడా కొంతమందిక్కడ ఉన్నారు కదా? వీరందరి వ్యవస్థ ఈ ఆశ్రమమే చూసుకుంటుంది. ఎప్పుడూ నాకెలాంటి ఇబ్బందీ  కలగలేదు, ఇంటివల్లగానీ లేదా మరెవరివల్లనైనా గానీ.’

‘అయితే, పెళ్ళయ్యాక నా తిరుగుడు కొంత తగ్గిందని చెప్పాలి. మామూలుగా, నేను చాలా ఆలస్యంగా ఇంటికొచ్చే వాణ్ణి కదా. ఎక్కడేనా కథ నడుస్తుంటే, భాగవతమో, నాటకమో నడుస్తుంటే నేరుగా అక్కడికి వెళ్ళిపోయేవాణ్ణి. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి, చూడాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. పగలు లేదు, రాత్రి లేదు. ఎన్నో సార్లు కథలు రాత్రి పూట నడిచేవి. చూడటానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎన్నోసార్లు ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ప్రోగ్రాము జరుగుతుంటే చూడటానికి వెళ్ళేవాళ్ళం. అలా అదంతా చాలా బాగుండేది. ఇబ్బందేమీ ఉండేది కాదు.’

ఆధునిక చదువుల వ్యామోహం పిల్లలపై అత్యాచారం

‘కానీ  నేను చాలాచోట్ల చూసాను. ఇబ్బంది పడే ప్రజల్ని. జనం వారిస్తారు, చాలా వారిస్తారు. ఇంట్లో వాళ్ళు వారిస్తారు. ఇప్పుడు ఎంత ఘోరంగా తయారయ్యిందంటే ఆశిష్, హైదరాబాదులో మేమొక పండితుడిదగ్గరికి వెళ్ళాం. జ్యోతిష్యంలో గొప్ప పండితుడు ఆయన. ఆయన సంతానం కంప్యూటరు చదువుతోంది. మేం భోజనానికి కూర్చున్నాం. పిల్లలు ఇలా పుస్తకం చదువుకుంటూ భోజనం చేస్తున్నారు! ఆ తర్వాత ఇలా చేయి పెట్టారు. వాళ్ళమ్మ ఆ చేయి కడిగింది. తుడిచింది, కంచం తీసుకెళ్ళిపోయింది! నేనా పండితుణ్ణడిగాను. ‘జ్యోతిష్యం చదువు కంప్యూటరు చదువు కంటే తక్కువదా? అది చాలా పెద్దగణితం కదా. మీ అమ్మ ఎప్పుడేనా నిన్నిలా ముద్దుచేసారా?’ అని. ‘కొట్టిలేపేవారు మమ్మల్ని. పనులన్నీ చేయాల్సి వచ్చేది ‘అన్నాడాయన. ‘మరి ఈ చదువు కన్న మీ చదువులో ఏం తక్కువుందని? అంత గొప్ప చదువు అది. కానీ ఆ రోజుల్లో ఎవరూ ఇలా ముద్దు చేసేవాళ్ళు కాదు. ఈ రోజు కంప్యూటరు చదువు చదువుతుంటే ఇంత నాటకం నడుస్తోంది, చదువుతున్నాడు చదువుతున్నాడు అని’ అన్నాను. మేమొక ఇంట్లో కూచున్నాం. తల్లి భోజనం చేస్తోంది. అబ్బాయి చదువుకుంటున్నాడు లేదా ఏదో చేస్తున్నాడు. ఇంతలో బెల్ మోగింది. బెల్ మోగగానే ఆ అబ్బాయి లేవబోతుంటే, ‘వద్దు, వద్దు, నువ్వు లేవద్దు, నేను చూస్తాను ‘అని ఆమె భోజనం చేస్తూనే వెళ్ళి తలుపు తీసింది! ఇప్పుడు పిల్లలమీద ఇంత అత్యాచారం జరుగుతోంది! అవును వారిని ఏమీ చేయనివ్వడం లేదు- చదువు చదువు చదువు అని, ఘోరం! ఈ చదువుల పిచ్చి ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఎక్కువగానే ఉంది.’

‘అన్నిచోట్లా ఉందనుకోండి. కాని ప్రస్తుతం ఉన్నంతపిచ్చి మరెక్కడా ఉండదు. నాగ పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్నప్పుడు, నాగ పూర్ లో కొందరు పిల్లలు ఎక్కారు. డెహ్రాడూన్ వెళ్తున్నారు. చాలా అల్లరి చేస్తున్నారు- ఆ అబ్బాయిలు, ఆ అమ్మాయిలు. వారితో పాటు వారి మాష్టరుగారు కూడా ఉన్నారు, లెక్చరరు కూడా వున్నారు. ఆ పిల్లలు ఆయనతో కూడా హాస్యమాడుతున్నారు. మేము ఢిల్లీనుండి తిరిగి వస్తున్నప్పుడు  ఏపీ ఎక్స్ ప్రెస్ లో కూచున్నాం. అందులో చాలామంది యువకులు ఎక్కారు-ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవాళ్ళు. కొద్దిసేపట్లోనే అంతా పుస్తకాలు ముందేసుకు కూచున్నారు. ఎవరూ ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఏమీ లేదు. లైట్లు వేసుకుని రాత్రంతా పుస్తకాలు పట్టుకు కూచున్నారు. నిద్రపోలేదు. అంత పిచ్చి! జనాన్ని చాలా పిచ్చోళ్ళని చేసేసారు. మహారాష్ట్రలో లేదా మరెక్కడైనా ఇంత పిచ్చి ఉండదు. ఎక్కడ ఎంజాయ్ చేయాలో అక్కడ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం, మాటల్లేవు, ఏమీ లేదు.’


గురూజీ మాటలు వింటుంటే నాకో సంగతి గుర్తొచ్చింది. ఒక సారి మా డైరక్టరు సెలవులో వెళ్ళినప్పుడు మా సెక్రటరీ ఇంఛార్జిగా ఉన్నారు. ఆయన ఒకరోజు చెప్పాపెట్టకుండా సర్ప్రైజ్ గా ఆఫీసు సందర్శించారు. కింద ఫ్లోరులో ఆఫీసు సెక్షన్లు ఒక రౌండు కొట్టి మొదటి ఫ్లోరులో ఉన్న నా గదికి వచ్చారు. నేను మౌనంగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఆయన్ని గమనించలేదు. ఆయన నన్ను పలకరిస్తూ ‘ఏమిటి మీ ఆఫీసులో అంతా యానిమేటెడ్ గా ఉన్నారు! నిశ్శబ్దంగా కూచుని ఎవరి పని వాళ్ళు చేసుకోవడం లేదేంటి?’ అనడిగారు. నేను ఆశ్చర్యపోయాను. ఆఫీసు అంటే ఆయన దృష్టిలో ఉన్న మనోచిత్రం అది. సెక్షన్లలో అందరూ ఎవరి సీట్లల్లో వాళ్ళు కూచుని తలలు వంచుకుని ఎవరి ఫైళ్ళు వాళ్ళు చదువుకుంటూ రాసుకుంటూ ఉండాలన్నమాట! నా అదృష్టవశాత్తూ ఆయన నా గదిలోకి వచ్చినప్పుడు వేరే ఎవ్వరూ లేరు. నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. నన్ను చూడగానే, ఒక ఆఫీసరు ఎలా ఉండాలని ఆయన మనోచిత్రంలో ఉందో, ఆ దృశ్యం దానికి సరిపోయింది!

గురూజీ చెప్పిన మాట చాలా సరళంగా కనిపిస్తున్న చాలా ముఖ్యమైన మాట. మనకి తెలీకుండానే authority మన body language ని కూడా శాసిస్తుంది. ఆ సెక్రటరీ తన ఆఫీసులో గుమాస్తాలు ఎలా పనిచేసుకోవాలని అనుకుంటున్నాడో దానికీ, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుకుంటూ ఉండాలో అని ఆశిస్తున్నదానికీ మధ్య ఏమీ తేడా లేదు!

ఈస్తటిక్స్ అంటే ఏమిటో ఒక గోండు ద్వారా తెలిసింది

గురూజీ ఇంకా చెప్తున్నారు: ‘ఆ కాలంలో వృద్ధుల ద్వారా చాలా మంచి సమాచారం తెలిసేది. వాళ్ళు చాలా సామాజిక విషయాల గురించి మాట్లాడేవారు. చెప్పేవారు. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఆ విషయాలే కదా. అవే విషయాలు పూర్తిగా! సాధారణ రైతులు మొదలుకుని రకరకాల ప్రజలనుండి చాలా సమాచారం దొరికింది. ఉదాహరణకి, కాలేజిలో మాకు సౌందర్య దృష్టి గురించి చెప్పినప్పుడు సౌందర్యదృష్టి అంటే ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. చాలా సార్లు అర్థం చేసుకోడానికి ప్రయత్నించినా అర్థం కాలేదు. దేన్ని సౌందర్యదృష్టి అంటారో తెలియలేదు. కానీ ఇక్కడికొచ్చినప్పుడు ఒక గోండు ద్వారా బోధపడింది. ఓహో! దీనే సౌందర్య దృష్టి అని అంటారూ అని.’

‘ఆయనేం చెప్పాడుమీకు?’ అనడిగాను.

‘ఏం చెప్పాడంటే- అక్కడ భీమన్న పూజ జరుగుతుంది కదా, భీమన్నని తీసుకొస్తున్నారు. భీమన్నను ఇలా అందంగా ఊపుకుంటూ తీసుకొస్తారు. కలపతో చేసిన భీమన్న. ఆయన ఆ వీథిలోకి రాగానే, నా పక్కన నిలబడ్డవాడు ‘గురూజీ, ఈ రోజు సరిగా ఎత్తలేదు, వీడికి ఎత్తడం రావడం లేదు’ అన్నాడు. ‘ఎందుకు? ఏమయ్యింది?’ అనడిగాను. ‘అక్కడైతే ఇలా ఊగుతుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది’ అన్నాడు. ‘మరి ఇటువేపొస్తే?’ ‘ఇటొస్తే ఇలా ఇలా ఊగాలి. అప్పుడు చాలా బాగుంటుంది’ అన్నాడు. అంటే ఆ ఇళ్ళ లైనింగుతో పాటు అది ఎలా ఊగితే అందంగా కనిపిస్తుందో చెప్పాడు. అప్పుడు అర్థమయింది నాకు ఈస్తటిక్స్ అంటే ఏమిటో. అన్నింటినీ  సమన్వయం చేసుకుంటూ ఎలా నడవాలో, ఎలా ఊగాలో, అదక్కడ నాకు అర్థమయింది. లేకపోతే అదంతా గందరగోళమైపోతుంది.’

అప్పటికి, నేనూ, అశీష్ మాత్రమే కాక, మరికొందరు శ్రోతలు కూడా వచ్చారు. వాళ్ళల్లో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. బహుశా ఒక పత్రికా విలేకరి కూడా ఉన్నట్టు గుర్తు. వాళ్ళల్లో ఎవరో, ‘ఈ వెల్ఫేర్ సిస్టం, ఈ గిరిజనుల వెల్ఫేర్ సిస్టం ఎప్పటినుంచి పూర్తిగా పాడైపోయింది?’ అనడిగాడు. గురూజీ ఇంకా ఈస్తటిక్స్ లోనే ఉన్నారు. ఆయన అక్కణ్ణుంచి ఒక్కసారిగా వెల్ఫేర్ సిస్టం లోకి రావడానికి సిద్ధంగా లేరు. ‘ఆ, అది కూడా వస్తుంది. .. వస్తుంది’ అన్నారు.

అప్పుడు ఆశిష్ అందుకుని,  ‘ఇప్పుడు కేవలం జ్ఞానానికి సంబంధించిన మూలాలేమిటనే దాని మీద  చర్చ జరుగుతోంది. What are the sources of knowledge? సాధారణ ప్రజల నుండి మొదలుపెట్టి మహాత్ముల దాకా, పురాణాల మొదలుకుని అటు ఇటు తిరగడం ద్వారా, అధ్యయనం ద్వారా, విద్యాభ్యాసం ద్వారా- ఇదంతా ఒక ఎత్తు,  మరోవైపు కుటుంబం నుండి ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకపోవడం ఇవన్నీ జ్ఞానార్జనని సౌకర్యవంతంగా సాగనిస్తాయి.  ప్రస్తుతానికి దానిమీదనే చర్చ జరుగుతోంది. వీటి ద్వారా ఏం తెలుసుకున్నారనేది రేపటినుంచి మాట్లాడబోతున్నారు ‘ అని అన్నాడు.

‘అవును’ అన్నారు గురూజీ నవ్వుతూ. తన ప్రయాణాన్ని అంత సులభంగానూ, సరళంగానూ సంగ్రహంగా చెప్పినందుకు ఆశిష్ వైపు గురూజీ మెచ్చుకోలుగా  చూసారు.

మేం ఒంటరివాళ్ళం కామని తెలిసింది

ఆ సమయంలో, మొదట చిన్న ఆశ్రమం తయారైనప్పుడు, ఈ భూమిని మేము తీసుకున్నాం. ఆ సమయంలో పి. బి. శ్రీనివాస్ వచ్చాడు. ఆయన ‘కపార్ట్’ (CAPART) ద్వారా డీఆర్డీఏ లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వచ్చాడు. ఆయనకు ఎలా తెలిసిందో ఆశ్రమానికి వచ్చాడు. దసరా రోజు అనుకుంటా అది. ఆశ్రమానికి వస్తే, ‘మీతో ఏం మాట్లాడాలి? నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి, నేను మాట్లాడను’ అన్నాను. కానీ ఆయన నా వెంటపడ్డాడు. రోజూ వచ్చేవాడు. ఆ తర్వాత ఆయనతో మెల్లగా మాటలు కలిశాయి. మాటలు కలుస్తూ కలుస్తూ, ఆయన చాలా మందిని ఇక్కడికి తీసుకొచ్చాడు. హుజరమ్మ, గోపీకృష్ణ, వినూ కాలే- వీళ్లందరినీ తీసుకొచ్చింది ఆయనే. ఆయన వయసు చిన్నదే, కానీ ఆయనకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి- పి. డి.కె. రావు నుంచి బి. డి. శర్మ దాకా. వారిని కూడా పట్టుకొచ్చాడొకసారి. వీళ్లందరితో ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉండేది.

ఆయన చేసిన అతి పెద్ద పని ఇలాంటి పనులు చేసే వాళ్లందరినీ ఒకరినొకర్ని కలపడం. అందరూ విడివిడిగా పనులు చేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు తెలియదు. ఆయన అందరినీ ఒకరినొకరు కలిపాడు. అప్పుడనిపించింది, మనం ఒంటరిగా లేమని. ఆ తర్వాత మెల్లగా ఇంత మంది రావడం పోవడం మొదలైంది, అందరూ తమ తమ రంగాలలో దిగ్గజాలు. కాలే గారు, ఇదంతా. కానీ ఈ ప్రజలందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. అమ్మ నుండి మొదలుపెట్టి, గోపి నుండి అందరివరకు. అప్పుడే ధరమ్‌పాల్ గారితో మొదటిసారి పరిచయం అయింది. శ్రీనివాస్ తీసుకెళ్లాడు.

ఆ సమయంలో ఇక్కడ ఒక మాట నడిచింది. నా ఉద్దేశం ఏంటంటే, నాతో పాటు ఆ సమయంలో ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉండేవారు, నిశికాంత్ ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, శ్రీపాల్ ఉన్నాడు. వాళ్లకు ఖాళీ దొరికినప్పుడు వచ్చేవారు. ఆ సమయంలో అనుకున్నాం, మనం ‘ఆదిలాబాద్’ టెక్నిక్, విద్యలు ఏవైతే ఉన్నాయో, దానిదొక ప్రదర్శన చేద్దాం, దానిదొక అధ్యయనం చేద్దాం అని అనుకున్నాం. అదంతా చేస్తాం, చాలా పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం. కానీ దానికి మొత్తం కలిపి 20 వేల రూపాయలు కంటే ఎక్కువ అవసరం లేదనిపించింది. కానీ మా దగ్గర అయితే అంత డబ్బు లేదు కదా. ఇంతలో ముంబై నుండి ఒక ఉత్తరం వచ్చింది. PPST అనే సంస్థ ఏర్పాటయింది, వాళ్లు ‘ట్రెడిషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పేరుతో ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు అని. నేను శ్రీనివాస్‌తో ‘మనం ఇక్కడ చేసి అక్కడికి వెళ్దాం’ అని. ‘లేదు లేదు, అక్కడ చూసి ఇక్కడ చేద్దాం’ అని వీడి పట్టుదల. అది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, మనం మన స్థాయిలో చేద్దాం మొదట, అక్కడ మాట్లాడటానికి మన దగ్గర సమాచారం ఉండాలి కదా అని నేను.

80-85 ప్రాంతంలో ఐఐటీల్లో ఒక చిన్న గందరగోళం జరిగింది. చాలా మంది అడగడం మొదలుపెట్టారు, ‘ఈ ఆధునిక విద్య కంటే ముందు మన దగ్గర ఎలాంటి విజ్ఞానం, ఎలాంటి విద్యలు లేవా? ఉంటే మనం దాని గురించి ఎందుకు మాట్లాడరు?’ అని. ఎందుకంటే అలాంటి ఐఐటీ కుర్రాళ్ళని నేనిక్కడ చూసాను. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లు, మట్టి గోడ ఎలా తయారవుతుందో ఇక్కడికి వచ్చి చూశారు. వాళ్లకు తెలియదు మట్టితో కూడా ఇల్లు తయారవుతుందని, మట్టితో కూడా గోడ తయారవుతుందని. వాళ్ళిక్కడికి వచ్చి చూసి చాలా ఆశ్చర్యపోయారు. ‘మాకెప్పుడూ ఇలాంటి విషయాలు నేర్పించలేదు’ అని. ఆ సమయంలో ముంబైలో చాలా పెద్ద ప్రోగ్రాము చేసారు. దానికి మేము కూడా వెళ్ళాం.

ధరమ్ పాల్ జీ పరిచయం- వార్ధాతో అనుబంధం

‘ధరమ్‌పాల్ గారితో మొదటిసారి కలిసింది ‘కుమారప్ప’ శతజయంతి జరుపుకున్నప్పుడు, వార్ధా లో. ఆ సమయంలో నేను, రామకృష్ణ, గోపి, హుజరమ్మ, శ్రీనివాస్, రామకృష్ణ మేమందరం వెళ్లాం అక్కడికి. అక్కడ మొదటిసారి పరిచయం అయింది. ధరమ్‌పాల్‌ గారి భావాలు, ఆయన ఆలోచనా విధానం చాలా విశిష్టమైనవి. ఆయన మొదటి చూపులోనే నన్ను సరిగ్గా అంచనా వేశారు, నన్ను అర్థం చేసుకున్నారు. ధరమ్‌పాల్‌ గారు చాలా చురుకైన వ్యక్తి. ఆ తర్వాత ఆయన చాలా మందిని ఇక్కడికి పంపించారు. ఈ PPST గ్రూప్ మొత్తాన్ని ధరమ్‌పాల్‌ గారే ఇక్కడికి పంపించారు. ధరమ్‌పాల్‌ గారు ఆ తర్వాత కూడా చాలా మందిని ఇక్కడికి పంపిస్తూ ఉండేవారు.’


ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన వారి గురించి మీకు కొంత పరిచయం చెయ్యాలి. ధరం పాల్ (1922-2006) భారతదేశ  చరిత్రకారుల్లో ప్రసిద్ధుడు. రాజనీతి తత్త్వవేత్త, గాంధేయవాది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య యోధుడు కూడా . ప్రాచీన భారతీయ పత్రాల సేకరణలో ఆయన చేసిన అమూల్యమైన కృషి వల్ల, వలసవాదం కన్నా పూర్వపు భారతీయ సమాజం గురించి మనకి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోడానికి వీలు చిక్కింది. బ్రిటిష్ వారి రాకకు పూర్వం భారతదేశంలో వ్యవసాయం, విద్య, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో దేశీయ పద్ధతుల గురించీ, ధోరణుల గురించీ ఆయన చాలా విస్తారమైన పరిశోధన చేసారు.

ముఖ్యంగా, వలసవాదం ప్రవేశపెట్టిన ఆధునిక విద్యావిధానం కన్నా ముందు భారతదేశంలో నడుస్తుండే విద్యావిధానం గురించి ఆయన ఎంతో చరిత్ర వెలికి తీసారు. The Beautiful Tree : Indigenous Indian Education in the Eighteenth Century and Indian Science and Technology in the Eighteenth Century అనే రచన, ప్రాథమిక విద్య గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చదివితీరవలసిన పుస్తకం. ఆధునిక విద్య రాకముందు భారతదేశంలో విద్యావకాశాలు ఎంత విస్తృతంగా ఉండేవో, ఎలా అన్ని సామాజిక వర్గాల్నీ కలగలుపుకుని నడిచేవో ఆయన సోదాహరణంగా నిరూపించారు.

వినూ కాలే (1946-98) ని Bamboo Man అంటారు. ఆయన చదువుకున్నది ఆర్కిటెక్చరు. కాని ఆ తర్వాత మూడు దశాబ్దాల పాటు వెదురుపనివాళ్ళతో పనిచేసారు. కలపకీ, ఇనుము-ఉక్కుకీ వెదురు ఎలా గొప్ప ప్రత్యామ్నాయం కాగలదో చూపించారు. ఆయన గాంధేయదార్శనికుడు. ఒక విజనరీ. కేరళలో, మహారాష్ట్రలో గిరిజనుల్తో కలిసి పనిచేసారు. కళాశ్రమాన్ని కూడా సందర్శించారు.

బ్రహ్మ దేవ్ శర్మ (1931-2015) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో 1956 బాచ్ అధికారి. అప్పటి మధ్యప్రదేశ్ లో బస్తర్ జిల్లా కలెక్టరుగా ఆయన చేసిన కృషి, గిరిజనుల పైన నడుస్తున్న రకరకాల దోపిడీవిధానాలతో తలపడిన తీరు సుప్రసిద్ధాలు. ముఖ్యంగా షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయత్ రాజ్ చట్టాన్ని విస్తరింపచేయడంలో ఆయన చేసిన కృషి గిరిజన ప్రాంతాలపైన శాశ్వతమైన ముద్ర వేసింది.

పి.డి.కె.రావు న్యూక్లియరు ఫిజిక్సులో ఉన్నత విద్య అభ్యసించాక కొంతకాలం అమెరికాలో పనిచేసారు. కానీ స్వదేశానికి ఏదైనా చెయ్యాలన్న తపన వల్ల అక్కడ ఉద్యోగం వదిలిపెట్టి, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ‘శోధన’ అనే సంస్థ స్థాపించి దళితులకోసం, గ్రామీణ మహిళల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా బీద కుటుంబాల పిల్లలకోసం చేపట్టి నడుపుతున్న ‘బాలబడి’ అనే ప్రి-స్కూలు కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాశాఖకీ, మహిళా శిశుసంక్షేమ శాఖకీ ఆ రంగంలో దారి చూపించింది.

గురూజీ హుజూరమ్మ అని పిలిచే, ఉజ్రమ్మ బిల్లిగ్రామి హైదరాబాదుకి చెందిన యాక్టివిస్టు. దస్త్ కార్- ఆంధ్రా, మల్కా  మార్కెటింగ్ ట్రస్టుల ద్వారా, చేనేతలో కొత్త పుంతలు ప్రవేశపెట్టడానికి, చేనేత కారుల స్థితిగతులు మార్చడానికీ ఆమె చేసిన ప్రయత్నాలు వాటికవే  ఒక చరిత్ర. గురూజీకి ఆమె మంచి మిత్రురాలు మాత్రమే కాదు, ఎన్నో విషయాల్లో ఆయనకి వెన్నుదన్నుగా నిలబడ్డ వ్యక్తి. ఉజ్రమ్మ గారి గురించి,  కళాశ్రమంతో ఆమెకి అనుబంధం గురించీ, సామల సదాశివ గారి ‘యాది’లో కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లున్నాయి.

రామకృష్ణ, శ్రీనివాస్ ఇద్దరూ చెన్నైలో ఐ.ఐ.టి చేసారు. శ్రీనివాస్ ఆ తరువాత కలకత్తా ఐ.ఐ.ఎం లో ఎం.బి.ఏ కూడా చేసారు. వారు ఇంజనీరింగ్ విద్య పూర్తిచేసాక, ఉన్నత ఉద్యోగావకాశాలు వదులుకుని గురూజీ దగ్గరే చాలాకాలం ఉండిపోయారు.  రామకృష్ణ ఇప్పుడు శ్రీకాళహస్తి కేంద్రంగా ఆయుర్వేదం పైన చాలా కృషి చేస్తున్నారు. అవివాహితుడు. కాళహస్తి పరిసర ప్రాంతాల్లో విస్తారంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడమే ఆయన తీరిక సమయపు వ్యాపకం. కళాశ్రమాన్నిలా దేశవ్యాప్తంగా ఎందరికో పరిచయం చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం విశాఖపట్టణం కేంద్రంగా సేంద్రియ ఎరువుల ఉత్పత్తిమీద కృషి చేస్తూ ఉన్నారు. నేను ఉట్నూరులో ఉండేటప్పుడు, కళాశ్రమానికి వెళ్ళినప్పుడల్లా, అటువంటి విద్యాధికులు అక్కడ కూచుని రాట్నం వడుకుతూ ఉండే దృశ్యం నన్నెంతో ఉత్తేజపరిచేది. నేను కూడా వాళ్ళలాగా  రాట్నం వడకాలని ఉత్సాహపడితే  గురూజీ నాకు రెండు రాట్నాలిచ్చారు. ఉట్నూరులో ఉండగా కొన్నాళ్ళు వడికాను కూడా.

గోపి అంటే గోపీకృష్ణ. ఆయన ప్రధానంగా డిజైన్ కళాకారుడు. ప్రస్తుతం కర్ణాటకలోని బెల్గాంలో శ్రామిక అభివృద్ధి సంఘం అనే ఒక సంస్థ ద్వారా గొర్రెల కాపరులతో ఊలుకి సంబంధించిన ఉత్పత్తుల మీద కృషి చేస్తున్నారు. ఆయన కళాశ్రమం కార్యక్రమాల్లో ఇప్పటికీ చురుగ్గా పాల్గొంటున్నారు. 

PPST  అంటే, Patriotic and People-oriented Science & Technology Group. దేశీయ పరిజ్ఞానం మీదా, సాంప్రదాయిక సాంకేతిక పరిజ్ఞానాలమీదా కృషిచేసే శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఆ బృందంలో పనిచేస్తుంటారు.


గురూజీ చెప్తున్నారు: ‘మేము ధరమ్‌పాల్‌ గారిని కలవడానికి చాలా సార్లు వెళ్లేవాళ్లం. నా ఉద్దేశం ఏంటంటే ధరమ్‌పాల్‌ గారి మాటలను వినాలని, కానీ అక్కడికి వెళ్తే ధరమ్‌పాల్‌ గారు నాపై కాస్త కోపంగా ఉండేవారు. మాట్లాడకుండా అలా కూర్చుండిపోయేవారు. ‘చూడండి, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలు వచ్చారు, వీళ్లకు మిఠాయిలు తినిపించండి. లేకపోతే వీళ్లు ఏమనుకుంటారంటే, ఉత్తర భారతీయులకు మర్యాద చేయడం కూడా తెలియదు అనుకుంటారు’ అనేవారు. ‘అవును, నీకు ఇక్కడికి రావడానికి సమయం దొరికింది కదా, రాయడానికి మాత్రం నీకు సమయం దొరకదు’ అంటూ, ‘ఇదంతా రాయాలి’ అని చాలా గట్టిగా చెప్పేవారు.

ఆయన కోపమంతా ఒక పక్కన నడుస్తున్నా, సేవాగ్రామ్‌లో ఉన్న ప్రజలందరికీ చెప్తూ ఉండేవారు, ‘రండి, శర్మ గారు వచ్చారు, రండి, ఇవాళ కూర్చుని విందాం’ అని అందరినీ ఒకచోట చేర్చేవారు. కూర్చుని, ‘సరే శర్మ గారు, దాని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి’ అనేవారు ధరమ్‌పాల్‌ గారు. నేను చాలా సార్లు ధరమ్‌పాల్‌ గారి మాటలు వినాలనుకునేవాడిని, కానీ అక్కడికి వెళ్తే ధరమ్‌పాల్‌ గారు నన్నే మాట్లాడమని చెప్పేవారు.’

‘ధరమ్‌పాల్‌ గారు చాలా విషయాలు రాసి పెట్టుకునేవారు, ఆ తర్వాత వారి పుస్తకాలలో చాలా విషయాలు రాశారు కూడా. ఆయన దగ్గర చాలా డాక్యుమెంట్లు ఉండేవి. దాదాపు 50 వేల డాక్యుమెంట్లు. ప్రతి చిన్న విషయం పైన, బ్రిటిష్ వాళ్లు ఏమేం రికార్డు చేశారు, ఏం రాశారు అనే డాక్యుమెంట్లు వారి దగ్గర ఉండేవి. వాటన్నింటినీ వెలికితీశారు, చాలా సంవత్సరాలు శ్రమించి సేకరించారు. జయప్రకాశ్ నారాయణ్ గారు ఏర్పాట్లు చేసి ధరమ్‌పాల్‌ గారిని విదేశాలకు పంపించారు, అక్కడ లైబ్రరీలలో కూర్చుని, ఆర్కైవ్స్‌లో కూర్చుని ఇవన్నీ వెలికితీశారు. ఆయన కేవలం ఒకే వేలితో టైప్ చేసేవారు, మొత్తం. అలా దాదాపు 50 వేల డాక్యుమెంట్లు సేకరించారు.’

‘నేను భిక్షావృత్తి గురించి మాట్లాడినప్పుడు, ఆయన ఆ డాక్యుమెంట్లు బయటకు తీశారు ఎక్కడి నుంచో. వారికి ఆ డాక్యుమెంట్లు దొరికాయి. కులాల పైన ఎప్పుడెప్పుడు నిషేధం విధించారు, ఎలా నిషేధం విధించారు అనే ప్రతి దానికి సంబంధించిన డాక్యుమెంట్ వారి దగ్గర ఉండేది. విద్యా విధానం గురించిన చాలా పెద్ద సమాచారాన్ని వారు వెలికితీశారు. ఆ సమయంలో 20 సంవత్సరాల సర్వే డాక్యుమెంట్లు బయటకు తీశారు. బెంగాల్‌లో వచ్చిన కరువుల గురించి వారి దగ్గర డాక్యుమెంట్లున్నాయి. ఎందుకంటే అవి ప్రకృతి సిద్ధంగా వచ్చిన కరువులు కావు, ఆ కరువులను సృష్టించారు. చాలా మంది ప్రజలు అందులో చనిపోయారు కదా, దానికి సంబంధించిన చాలా డాక్యుమెంట్లు, వారి దగ్గరుండేవి. చిన్న చిన్న వ్యవస్థలను వాళ్లు ఎలా తయారు చేశారు, ఏదైనా ఒక వ్యవస్థను అంతం చేయడానికి ఎప్పుడు మీటింగ్ జరిగింది, ఎలా జరిగింది- ఇవన్నీ వెలికితీసి తెచ్చారు.

ఆయన ఏ డాక్యుమెంట్ల గురించైతే మాట్లాడేవారో, అవన్నీ ఇవాల్టి యువతరానికి చాలా అవసరం. వీళ్లు ఆధారం అడిగితే, అక్కడ ఆధారం ఉంది. కానీ నేను ఏ విషయాలైతే మాట్లాడుతున్నానో, నేను గత 50 సంవత్సరాలలో ఏవైతే చూశానో, నేను ఆ విషయాలు మాట్లాడుతున్నాను. ధరమ్‌పాల్‌ గారు 200 సంవత్సరాల క్రితం నాటి డాక్యుమెంట్లన్నింటినీ బయటకు తీశారు, ఆయన కూడా ఇవే విషయాలు మాట్లాడుతారు, కానీ నేను నా కళ్లతో ఏం చూశానో ఆ విషయాలు మాట్లాడుతున్నాను. అలా అన్నమాట.

అందుకే ధరమ్‌పాల్‌ గారు చాలా విషయాలు నన్ను అడుగుతూ ఉండేవారు చాలా సార్లు. ‘దాని గురించి చెప్పు, దీని గురించి చెప్పు, ఏంటి, ఎలా?’ అని. డాక్యుమెంట్ల ద్వారా అన్ని వ్యవస్థల గురించి సమాచారం దొరకదు కదా. ఏ వస్తువును ఎలా అంతం చేశారు అనేది అందులో తెలుస్తుంది, ఏ వస్తువును ఎలా అమలు చేశారు అనేది అందులో పూర్తిగా తెలుస్తుంది.’

‘ధరమ్‌పాల్‌ గారి దగ్గర మొదట ఈ పీపీఎస్‌టీ వాళ్లు ఉండేవారు. ఆ తర్వాత ఒక చిన్న గ్రూప్ ఏర్పడింది, ఒక ఏడెనిమిది మంది యువకులు వారి దగ్గర ఉండేవారు. అందులో శ్రుతి కూడా ఉంది, కన్నన్ మొదలైన వాళ్లు ఉన్నారు, ఎల్విన్ ఉన్నాడు, విజయ్ చారియా ఉన్నాడు, వీళ్లంతా ఉండేవారు. అలా కూర్చుని చాలా విషయాలు రికార్డు చేశారు, రాశారు.’

‘ధరమ్‌పాల్‌ గారికి చాలా త్వరగా కోపం వచ్చేసేది. చాలా కోపపడేవారు, తిట్టేవారు, కొన్నిసార్లు బయటకు పొమ్మనేవారు. ‘వెళ్లిపోండి, మీకేం అర్థమవుతుంది, ఏంటి?’ అని కొన్నిసార్లు బయటకు కూడా పంపించేసేవారు. చాలా తిట్టేవారు. కానీ వీళ్ళు ఆయన దగ్గర చాలా కాలం ఉన్నారు, ఆ తర్వాత, రాజు దీక్షిత్, ప్రదీప్ దీక్షిత్ వీళ్లంతా వచ్చారు, చివరి వరకు వీళ్లే ఉంటూ వచ్చారు బహుశా. వాళ్లు ఎంత పని చేశారో నాకు పూర్తిగా తెలియదు.’

‘వీళ్లు కూడా నాతో పాటే ఉంటూ వచ్చారు మొత్తం. కానీ నాది మధ్యమధ్యలో వెళ్లడం రావడం ఉండేది. నేను ఇక్కడికి వచ్చి ఒక నాలుగు రోజులు కూర్చునేవాడిని ధరమ్‌పాల్‌ గారితో. చాలా బాగా ఉండేవారు.
ఆయన స్వభావం గురించి చాలా మాట్లాడేవారు. మన స్వభావాలు ఎలా ఉండేవి, ఆ స్వభావాలను మార్చడానికి వలసపాలకులు ఏం చేసారు అని. ఉదాహరణకి మన హోటళ్లలో ఏ పద్ధతి ఉందో మనం అదంతా ఇటువైపు నుండి చేస్తాం, హోటళ్లలో మొత్తం దానికి పూర్తిగా విరుద్ధంగా నడుస్తుంది. నీళ్ల గ్లాసు మనం ఎడమ చేతి వైపు పెట్టుకుంటాం, హోటళ్లలో కుడి చేతి వైపు పెడతారు. ఇలా చిన్న చిన్న విషయాల గురించి ఒకసారి చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. ప్రపంచమంతా కుడి వైపు నుండి నడవాలనుంటే, మన దగ్గర ఎడమ వైపు నుండి నడవాలని నేర్పించారు. ఎందుకంటే మన జంతువులకు కూడా కుడి వైపు నుండి నడిచే అలవాటు ఉంది. అలాంటి చిన్న చిన్న మార్పులు చేసి వలసపాలకులు మన మనస్తత్వంలో చాలా పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చారు. ఈ విషయాలన్నింటి గురించి ధరమ్‌పాల్‌ గారు చాలా చక్కగా చెప్తూ ఉండేవారు.

సామల సదాశివ గారు – నా ఆలోచనల ‘కసౌతి’

‘ఇక్కడ నుంచి  సదాశివగారు కూడా ఒకసారి వచ్చి  ఆరు రోజులు ధరంపాల్‌జీతో చాలా చక్కగా గడిపారు. సదాశివ గారు ఉర్దూ, పర్షియన్, మరాఠీ భాషలలో చాలా పెద్ద సాహిత్యకారుడు. విశేషం ఏమిటంటే, నా మనసులోకి ఎలాంటి ఆలోచన వచ్చినా, నేను నేరుగా సదాశివ గారి దగ్గరకు వెళ్లి మాట్లాడేవాడిని. ఆయన ఏ విషయాన్నీ అంత సులభంగా ఒప్పుకునేవారు కాదు. చాలా ఆలోచించి, విశ్లేషించి మాట్లాడేవారు. కాబట్టి నేను ఆయనతో చర్చించేవాడిని. నా మాటలు విని ఆయన తల ఊపారంటే, ఇక నేను హిందుస్తాన్ లో  ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలనని అర్థం. మొదట ఆయనను ఒప్పించాల్సి వచ్చేది, ఆయన నా మాటను అర్థం చేసుకుంటే, ఇక నేను ఎక్కడైనా మాట్లాడేవాడిని. అందుకే నేను ఎప్పుడూ ఆయనను ‘కసౌతి’, అంటే ఆకురాయి, అని పిలుస్తాను. బంగారం నాణ్యతను చూసే రాయి లాగా, నా ఆలోచనా విధానానికి ఆయన ఒక రాయి లాంటివారు.’

‘మఠంలో ఉండే  మహంతు గారు కూడా ఎవరూ లేనప్పుడు చాలా విషయాలు చెప్పేవారు. నేనాయనతో ‘నేనొక ఆశ్రమం నిర్మించాలనుకుంటున్నాను’  అని చెప్పినప్పుడు ఆయన కోపంగా—’నువ్వేమైనా శంకరాచార్యుడనుకుంటున్నావా?’ అన్నారు. ‘ఇలాంటి ఆలోచన వారు చేసారంటే అర్థముంది. నువ్వెలా చేస్తున్నావు?’ అని కోప్పడ్డారు. వారి నుండి చాలా విషయాలు తెలిశాయి. ఎవరూ లేనప్పుడు వారు చాలా విషయాలు మాట్లాడేవారు. సదాశివ గారి పద్ధతి కూడా అంతే. జనం మధ్యలో ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. జనాభాకు తగ్గట్లుగా మాట్లాడేవారు. ఎప్పుడైనా నేను ఒక్కడినే వెళ్తే, ఏదైనా ఒక విషయం గురించి అడిగితే చాలా వివరంగా చెప్పేవారు, ఇప్పటికీ చెప్తారు. ఆయన దగ్గర నుంచి నాకు  చాలా సమాచారం లభించింది.’

‘ఈ గిరిజన ఆచారాల గురించి, భిక్షావృత్తి చేసే వారి గురించి వారి ద్వారా చాలా విషయాలు తెలిశాయి. ఒకసారి ఒకాయన మంచం అల్లడానికి వెళ్తుంటే, సదాశివ గారు ఆయన్ని పిలిచి కూర్చోబెట్టారు. ఆ వచ్చినాయన మంచం అల్లుతుండగా నేను ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాను. మీరెవరని అడిగితే, బుడగ జంగాలని చెప్పారు. వారు భాగవతం చెప్పేవాళ్లు, రకరకాల విద్యలు ప్రదర్శించేవాళ్లు. వారితో మాట్లాడుతుండగా, ‘వసుధైక కుటుంబం’ అనే భావనను వారి సామాజిక వ్యవస్థలో ఎలా అమలు చేశారో నాకు అర్థమైంది. మంచం అల్లుతూనే ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు—చెట్టు చేమలకు, మనుషులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, జంతువులకు, పక్షులకు మనుషులతో ఉన్న బంధం ఏమిటి అనేది చాలా వివరంగా చెప్పారు.. ఈ కళాకారులతో, వృత్తిపనివారితో కలిసి ఉండటం వల్లే వారి మందుల పద్ధతులు ఏమిటి, వారు మందులెలా  తయారు చేసుకుంటారు లాంటి  విషయాలన్నీ అలా వినడం, చూడడం ద్వారా అర్థమయ్యాయి.’

ముగింపు: ప్రార్థన, దోహాలు, శాంతిమంత్రాలు

ఇక అప్పుడు, గురూజీ సదస్సు పూర్తయిందన్నట్లుగా, ‘మనమిప్పుడు ప్రార్థన చేద్దామా’ అనడిగారు. అక్కడున్నవారంతా అంగీకారసూచకంగా తలపంకించారు. అప్పుడు గురూజీ సౌమ్యకంఠంతో గాయత్రీ మంత్రం రెండు సార్లు పఠించారు. ఆ తర్వాత ఆయన హిందీ దోహాలు రాగయుక్తంగా వినిపించారు:

సాంచ్ బరాబర్ తప్ నహీ, ఝూఠ్ బరాబర్ పాప్
జాకే హిరదై సాంచ్ హై, తాకే హిరదై ఆప్

(సత్యంతో సమానమైన తపస్సు లేదు, అబద్ధంతో సమానమైన పాపం లేదు. ఎవరి హృదయంలో సత్యముంటుందో, వారి హృదయంలో సాక్షాత్తు ఆ భగవంతుడే నివసిస్తాడు.)

రహిమన్ ధాగా ప్రేమ్ కా, మత్ తోడో చట్కాయ్
తూటే సే ఫిర్ నా జుడే, జుడే గాంఠ్ పడి జాయ్

(ప్రేమానురాగాలు సున్నితమైన దారం లాంటివి. వాటిని ఒక్కసారిగా ముక్కలయ్యేలా తెంచకండి. ప్రేమ అనే దారం ఒక్కసారి తెగితే మళ్లీ అంత సులభంగా అతుక్కోదు; ఒకవేళ  అతికించినా, అక్కడొక ముడి మిగిలిపోతుంది.)

ఆయా హై సో జాయేగా, రాజా రంక్ ఫకీర్
కోయీ చలా చల్ సింహాసన్, కోయీ చలా బంధ్ జంజీర్

(ఇక్కడకొచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే- రాజుగానీ, పేదగానీ, ఫకీరుగానీ. అయితే కొందరు సింహాసనం ఎక్కినట్లు సగౌరవంగా కీర్తిమంతులై వెళ్తారు, మరికొందరు తాము చేసిన పాపాల వల్ల గొలుసుల్తో బంధించబడ్డ  ఖైదీల్లాగా వెళ్తారు.)

రామ్ నామ్ కీ లూట్ హై, లూట్ సకే తో లూట్
అంత్ కాల్ పఛ్తాయేగా, ప్రాణ్ జాయేంగే ఛూట్

(రామనామమనే సంపద విస్తారంగా ఉంది. కొల్లగొట్టుకోగలిగినంత కొల్లగొట్టుకోండి. లేకపోతే, అంత్యసమయం సమీపించినప్పుడు జీవితకాలం వృథాచేసామనే పశ్చాత్తాపం తప్పదు.)

బడా హుఆ తో క్యా హుఆ, జైసే పేడ్ ఖజూర్
పంథీ కో ఛాయా నహీ, ఫల్ లాగే అతి దూర్

(ఖర్జూరపు చెట్టు చాలా పొడుగ్గా పెరుగుతుంది, కానీ దాని వల్ల ఏం లాభం?అది బాటసారులకు కనీసం నీడ కూడా ఇవ్వలేదు, పైగా దాని పండ్లు కూడా ఎక్కడో అందకుండా ఉంటాయి. ఎదిగితే సరిపోదు; ఇతరులకు ఉపయోగపడనప్పుడు ఆ ఎదుగుదల వృథా.)

జా ఘట్ ప్రేమ్ నా సంచరే, సో ఘట్ జాన్ మసాన్
జైసే ఖాల్ లుహార్ కీ, సాన్స్ లేత్ బిను ప్రాణ్

(ఏ మనిషి హృదయఘటంలో ప్రేమ సంచరించదో, ఆ శరీరం జీవించి ఉన్నా  స్మశానసమానం. కమ్మరి కొలిమిలో తిత్తుల్లాగా ఊపిరి పీలుస్తుందిగాని, ప్రాణముండదు.)

దోహాల పఠనం పూర్తి కాగానే ఉపనిషన్మంత్రాలు, శాంతిమంత్రం వినిపించారు.

ఓం సహనాభవతు సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతిః

(ఆయన మనలను రక్షించుగాక, మనలను సమానంగా అనుగ్రహించుగాక, మనం గొప్ప శక్తితో, దివ్యబలంతో కలిసి పనిచేయుదుముగాక, మన విద్య మనల్ని పరస్పరం వెలిగించుగాక, మన మధ్య ద్వేష భావం తలెత్తకుండా ఉండుగాక, భౌతికంగా, దైవికంగా, ఆత్మికంగా మన తాపాలు శమించుగాక!)

అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతిః

(అసత్తునుంచి సత్యం వైపు, చీకటినుంచి వెలుగు వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు మమ్మల్ని నడిపించు. భౌతికంగా, ఆత్మికంగా, దైవికంగా మాకు సామరస్యాన్ని అనుగ్రహించు. )

ఓం పూర్ణమదః పూర్ణమిదమ్
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతిః

(అది పూర్ణం, ఇది కూడా పూర్ణమే. పూర్ణమయ అస్తిత్వం నుంచి పూర్ణమయ అస్తిత్వమే ప్రభవిస్తుంది. పూర్ణమయ అస్తిత్వం నుంచి పూర్ణమయ అస్తిత్వాన్ని తొలగించినా పూర్ణమయ అస్తిత్వమే మిగులుతుంది. )

ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతిః
పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః
వనస్పతయః శాంతిర్విశ్వేదేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః
సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సా మా శాంతిరేధి
ఓం శాంతి శాంతి శాంతిః

(ద్యులోకంలో శాంతికలుగుగాక, అంతరిక్షంలో శాంతికలుగుగాక, పుడమి మీద శాంతి కలుగుగాక, ఓషధులకు వనస్పతులకు శాంతి లభించుగాక, విశ్వమంతా ఆవరించి ఉన్న దేవతలకు శాంతి చేకూరుగాక, పరమసత్యం శాంతిమయమగుగాక, సమస్తమూ శాంతించుగాక, అందరికీ శాంతి కలుగుకాక, నాకు శాంతి కలుగుగాక.)

(మొదటిరోజు సంభాషణలు పూర్తయ్యాయి.)

8-6-2026

4 Replies to “జీవన శిల్పి-7”

  1. ఇప్పుడు కేవలం జ్ఞానానికి సంబంధించిన మూలాలేమిటనే దాని మీద చర్చ జరుగుతోంది. What are the sources of knowledge? సాధారణ ప్రజల నుండి మొదలుపెట్టి మహాత్ముల దాకా, పురాణాల మొదలుకుని అటు ఇటు తిరగడం ద్వారా, అధ్యయనం ద్వారా, విద్యాభ్యాసం ద్వారా- ఇదంతా ఒక ఎత్తు, మరోవైపు కుటుంబం నుండి ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకపోవడం ఇవన్నీ జ్ఞానార్జనని సౌకర్యవంతంగా సాగనిస్తాయి. ప్రస్తుతానికి దానిమీదనే చర్చ జరుగుతోంది. వీటి ద్వారా ఏం తెలుసుకున్నారనేది రేపటినుంచి మాట్లాడబోతున్నారు ‘ – నిజంగానే గురూజీ ఏం చర్చిస్తున్నారో.. ఏం చర్చించ బోతున్నారో ఇలా అర్థమయ్యేలా చాలా సులభంగానూ, సరళంగానూ సంగ్రహంగా చెప్పారు ఆశిష్ .
    ఎవరైనా మెచ్చుకోవలసిందే.

    గురూజీ ప్రస్తావించిన వారి గురించి మీరు చేసిన పరిచయం మహత్తరం గా ఉంది. ఆ వివరాలు తెలియకుండా వ్యాసం చదివితే పాఠకుడికి అర్థం కావడం చాలా కష్టమయ్యేది చాలా గ్యాప్స్ ఉన్నట్టు అనిపించేది కూడా.. మొదటి రోజు సంభాషణల్లో అన్నిటికన్నా ఈ భాగం లో సంభాషణ అర్థం చేసుకుంటూ చదవడానికి ఎక్కువ సమయం పట్టింది.

    ముగింపు ప్రార్థనలో దోహాలు, మీరు అందించిన తాత్పర్యాలతో సహా అద్భుతంగా ఉన్నాయి.

    ధన్యవాదాలు భద్రుడు గారు.

  2. మొదటి రోజు conversation లోనే ఎన్నో విషయాలు ఎన్నో ఊళ్లు, ఎంతో మంది మనుషులు సామాన్యులుగా కనిపించే అసామాన్యులు, ఎన్నో పనులు, రకరకాల విద్యలు, పుస్తకాలు!!

    Very interesting to know Guruji learned what aesthetics is from a common tribal person where aesthetics really lives in practice!
    భీమన్న పూజ గురించి గురూజీ చెప్తుంటే మా ఊరిలో గంగమ్మ జాతర గుర్తొచ్చింది. జాతర సమయంలో గంగమ్మ శిరస్సును ఊరేగింపుగా తీసుకెళ్తారు. శిరస్సును తలపై పెట్టుకొని మోసే వారు అటూ ఇటూ ఊగుతూ నడుస్తుంటే, గంగమ్మ శిరస్సు కూడా అందంగా ఊగుతూ కనిపిస్తుంది.
    ఆ దృశ్యం, అందులోని సౌందర్యం కట్టి పడేస్తుంది ప్రతి సారీ.

    మీ సహ శ్రోత ఆశిష్ గారు చాలా బాగా చెప్పారు conversation లో ఇంత వరకు ఏం నడిచిందో
    “ What are the sources of knowledge? సాధారణ ప్రజల నుండి మొదలుపెట్టి మహాత్ముల దాకా, పురాణాల మొదలుకుని అటు ఇటు తిరగడం ద్వారా, అధ్యయనం ద్వారా, విద్యాభ్యాసం ద్వారా” గురూజీ జ్ఞానార్జన చేస్తున్నారని.

    చివరలో దోహాలు, శాంతిమంత్రాలతో మొదటి రోజు సంభాషణ ముగిసిన తీరు చాలా బాగుంది. Your translations made it more meaningful Sir! 🙏🏽

    ఈ posts చదువుతుంటే మేము కూడా ఆ ఆశ్రమంలో కూర్చుని వింటున్న feel కలిగింది. ఎందరో మహానుభావుల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. 🙏🏽

  3. ఈనాటి
    ఉషోదయాన
    గూరూజీ మాటలు…

    నాకు తెలిసినవాటి నీడల్లో
    దాగి ఉన్న తెలియనితనాన్ని చూపాయి.

    మట్టిగోడలో ఒక తత్వం ఉందని,
    కష్టజీవి అరచేతిలో
    ఒక విశ్వవిద్యాలయం ఉందని,

    పుస్తకాల అక్షరాలకు అతీతంగా
    జీవితం కూడా ఒక పఠనీయ గ్రంథమని,
    జ్ఞానం అనేది శిఖరంపై నిలబడి
    ప్రపంచాన్ని చూడడం కాదని,

    ప్రతి మనిషి ముందు నమ్రంగా నిలబడి
    అతని అనుభవాన్ని వినగలగడం అని,
    అలా వినగలిగే ఓర్పును
    అలవాటు చేసుకోమని సూచించాయి.

    అంతేకాదు-

    జ్ఞానం అంటే వెలుగును కూడబెట్టడం కాదని,
    చీకటి ఎంత అనంతమో తెలుసుకోవడమని,
    ఎదగడం అంటే ఎత్తుకు చేరడం కాదని,
    వేర్ల లోతును గుర్తించడం అని
    ఈ తేడాలను గుర్తించే
    దృష్టిని పెంచుకోమని చెప్పాయి.

    ఈ ఉషోదయాన
    గురూజీ మాటలు వింటుంటే-

    ప్రతి సాధారణ జీవితంలో
    అసాధారణమైన అనుభవాల విశ్వం
    దాగి ఉందని
    దానిని దర్శనం చేసుకునే
    ఆలోచన చేయమని సూచించాయి

    ఈ ఉషోదయం…
    ఎన్నో జీవితాలను,
    ఎందరో మనుషులను,
    ఎన్నెన్నో మౌన సత్యాలను
    నిశ్శబ్దంగా పరిచయం చేసింది

    “ఈ జ్ఞాన పరిచయానికి వారధిగా నిలిచిన మీకు నా కృతజ్ఞతాభివందనాలు.”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading