
(ఒక రచన చేరవలసిన చోటుకి చేరిందని తెలిసినప్పుడు ఏ రచయితకైనా కలిగే సంతోషం మామూలుగా ఉండదు. గంటేడ గౌరునాయుడు నా ‘దశార్ణదేశపు హంసలు’ పుస్తకం లింక్ పంపమంటే పంపాను. ఈ రోజు ఆయన చేతుల్లో నిలువుటద్దం సైజులో ఆ పుస్తకం కనిపిస్తే ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను. 2019 లో వెలువరించిన ‘దశార్ణదేశపు హంసలు’ గురించి ఆయన మాటల్లోనే వినండి. పుస్తకం సాఫ్ట్ కాపీ కావాలనుకున్నవారు ఈ లింక్ నొక్కి పిడిఎఫ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.)
https://chinaveerabhadrudu.in/wp-content/uploads/2019/04/dasarnadesapu.pdf
వాడ్రేవుచినవీరభద్రుడుగారు తన అధ్యయనంలో భాగంగా రాస్తూవచ్చిన వివిధ సాహిత్యవ్యాసాలు ఇప్పటిదాకా ‘సహృదయునికి ప్రేమలేఖ’ (2001) ‘సాహిత్యమంటేఏమిటి’ (2011) ‘సాహిత్య సంస్కారం’ (2017) సంపుటాలుగా వెలువడ్డాయి, సాహితీ వేత్తల ప్రశంసల్ని పొందేయి. గత ఆరేడేళ్ళుగా ఫేస్ బుక్ మాధ్యమంగా మిత్రులతో పంచుకుంటూ వచ్చిన వివిధ సాహిత్య పరిశీలనలు ‘దశార్ణదేశ హంసలు’ పేరుతో పుస్తకంగా రానున్నాయి. ప్రస్తుతం ఈ గ్రంథం చినవీరభద్రుడు గారి నా కుటీరం లో చూడవచ్చు. లేదా వారి నుండి పుస్తకం లింక్ ను పొందవచ్చు.
కథ, కవిత్వం, వివిధవిషయాల పై రాసిన వ్యాసాలు, చేసిన ప్రసంగాలు, చిత్రించిన వర్ణచిత్రాలు ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనాలు. ప్రతిరోజూ ముఖపుస్తకంలో మిత్రులతో తన ఆలోచనల్ని పంచుకుని వాటిని పుస్తకాలుగా ప్రచురించి సాహిత్యప్రియులకు అందివ్వడం తన ప్రత్యేకత.
‘గూటెన్ బర్గ్ నుంచి జుకర్ బర్గ్ దాకా’ సాగిన ఒక సాంకేతిక ప్రయాణం వల్ల లభించిన కొత్త అవకాశాన్ని వినియోగించు కుంటూ సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతి, విద్య, విజ్ఞాన సమాజాలకు సంబందించి కలుసుకున్న మిత్రులు, చదివిన పుస్తకాలు, చేసినప్రసంగాలు, సందర్శించిన సంస్థలు మొ!! వాటిమీద ఎప్పటికప్పుడు ఫేస్ బుక్ లో రాసుకున్న వ్యాసాల లోంచి తెలుగు సాహిత్యం గురించి రాసిన వ్యాసాలను’దశార్ణదేశహంసలు’ పేరుతో, శ్రీ ప్రచురణగా వెలువడింది.
‘గుటెన్ బర్గ్ నుంచి జుకర్ బర్గ్ దాకా’ అంటూ వీరభద్రుడు గారి మాటతో మొదలైన ఈ 560 పేజీల గ్రంధము ‘దశార్ణదేశ హంసలు’ అనే వ్యాసం తన మాష్టారిగా గౌరవించే మల్లంపల్లి శరభయ్యగారి కాళిదాసు సంస్కృత శ్లోకం ప్రసక్తితో ముగుస్తుంది.
‘స్మరణీయులు’ శీర్షికలో కీర్తిశేషులైన 21 మంది సాహితీ వేత్తలకు అక్షర నివాళులర్పించేరు.
‘సాహిత్య దార్శనికత’ శీర్షికలో ఆరు వ్యాసాల్లో గురజాడ, గిడుగు, సంజీవదేవ్, కొత్తసచ్చిదానందమూర్తి వంటి సాహితీ మేరువుల ప్రశంస ఉంది.
ఈ వ్యాసల్లోనే “గౌరునాయుడూ ఈ పూట మీరూ, మన మిత్రులూ గురజాడ అప్పారావుని తలుచుకోడానికి పార్వతీపురం లో కలుసుకుంటున్నారు, నన్ను కూడా పిలిచేరు ఎంతో ప్రేమతో, కానీ రాలేకపోయాను” ,అని చదివి వినిపించమని రాసి నాకు పంపిన వ్యాసమూ ఉంది. ఆ వ్యాసాన్ని సభలో చదివి వినిపించేమప్పుడు.
‘తెలుగుభాష’ శీర్షికలో తాను హాజరైన సాహితీ సమావేశాల లోని అనుభవాల విశేషాలుగా 5 వ్యాసాలున్నాయి.’ప్రాచీనకవిత్వం’ విభాగంలో పదివ్యాసాలు, ‘ఆధునిక కవిత్వం’ విభాగంలో 26 వ్యాసాలు, ‘కథానిక’ విభాగంలో పది వ్యాసాలు, ‘నవల’ విభాగంలో 06, ‘అనువాదాలు’ లో 10, ‘తులనాత్మక సాహిత్యం’04, ‘లేఖాసాహిత్యం’ 03, ‘యాత్రాసాహిత్యం’ 03, ‘గిరిజనసమాజం’ 02, ‘పర్యావరణం’ 02, ‘చరిత్ర’ 04, ‘సన్మిత్రులు’ 13 , ‘సన్మిత్రులు’ లో కథకులగురువు కారా మాష్టారు, సి.వి.కృష్ణారావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి వారి ఔన్నత్యపు పరామర్శ మొత్తం 125 వ్యాసాల ఈ ‘దశార్ణదేశపుహంసలు’ సంపుటాన్ని భావుకులు, ప్రాక్పశ్చిమ దర్శనాలను సమన్వయించుకోగలిగిన చింతనాపరులు, సహృదయులు, శ్రీ సూరపురాజు రాధాకృష్ణ మూర్తి గారికి, వినయపూర్వకంగా ‘కానుక’ చేసుకున్నారు రచయిత.
ముసురుపట్టిన ఈ నాలుగురోజులూ ‘దశార్ణదేశహంసల’తోసాహితీ విహారం ఒక గొప్ప అనుభవం.
(ఈ ఫొటో తీసింది నా చిన్న మనవరాలు కుందన. ఫొటో ఉందని ఈ రెండు మాటలు)
గంటేడ గౌరునాయుడు
20-07-2023
నమస్సులు గంటేడు గౌరునాయుడు గారికి.
ధన్యవాదాలు సార్
Printed book ఎక్కడ దొరుకుతుందో తెలియచెయ్యండి దయచేసి.
ఈ పుస్తకం ప్రింట్ కాలేదు. ఈ బుక్ మాత్రమే అందుబాటులో ఉంది.
ధన్యవాదాలు సర్.