ఈ కవిత్వాన్ని ఏదో ఒక గాటన కట్టి ఉపయోగం లేదు. ఆ 'నువ్వు' ఎవరు అని శోధించీ ప్రయోజనం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇది ప్రేమ కవిత్వం కాదు, ధ్యాన కవిత్వం. ఇది వసుధారాణికి 'తెలిసి', ప్రయత్నపూర్వకంగా రాసిన కవిత్వం కాదు. ఎన్నో జన్మలనుండీ ఆమెని అంటిపెట్టుకుని వస్తున్న ఏ జననాంతర సౌహృదాల కస్తూరిపరిమళమో ఇట్లా ఒక్కసారిగా గుప్పుమంది.
నువ్వింకా ప్రజలకి బాకీ పడి ఉన్నావు
కవికీ పండితుడికీ మధ్య ఒక పచ్చికబయలు ఉంది. పండితుడు దాన్ని దాటాడా వివేకి అవుతాడు. కవి దాటాడా, ప్రవక్త అవుతాడు.