
పలమనేరు బాలాజీ రాసిన ఈ కవితలు చదువుతుంటే రెండేళ్ళ కిందట స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పటి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు నేను చిత్తూరు జిల్లా ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున పరిశీలకుడికిగా వెళ్ళాను. బాలాజీ అప్పుడు వి.ఆర్.కోట మండలానికి ఎన్నికల అధికారిగా ఉన్నారు. అదికాక మరో మండలానికి కూడా ఆయన ఇంఛార్జిగా ఉన్నట్టు గుర్తు. నిమిషం కూడా విరామంలేకుండా ఆ ఎన్నికల్లో ఆయన అహర్నిశలు పనిచేయడం దగ్గరనుంచి చూసాను. రోజంతా ఎన్నికల ఏర్పాట్లు చూసుకుని సాయంకాలమయ్యాక ఆయన నన్ను పలమనేరు తీసుకువెళ్ళారు. అప్పుడు కూడా, రాత్రి తొమ్మిది దాటాక కూడా ఆయన ఎవరో అధికారులతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడుతూనే ఉన్నారు. ఉద్యోగమూ, బాధ్యతలూ, చుట్టూ ఉన్న సమాజమూ ఒక మనిషిని ఇంతగా ఆక్రమించుకున్నాక ఆయనకి కవిత్వం చదవడానికీ, రాయడానికీ సమయమెక్కడుంటుందా అనుకున్నాను. కాని, ఈ కవితలు చదువుతుంటే, బహుశా ఇటువంటి మనుషులకే కవిత్వం చాలా అవసరమని అనిపిస్తూండింది.
2
ఈ పుస్తకంలోని కవితలు అన్నిటికన్నా ముందు జీవించడం గురించిన కవితలు, జీవిస్తున్న స్ఫురణని అనుభూతిలోకి తెచ్చుకుని, బతుకుని మరింత ఫలప్రదం చేసుకోవాలనుకునే కవితలు.
అనేకానేక వాణిజ్యప్రకటనల మధ్య
అతడు, ఆమె..ఒకరెవరో
ఉదారంగా నవ్వుతూ మాట్లాడతారు
వానచినుకులా,లేతమొగ్గలా
ఒకరెవరో మాట్లాడే ఆ నాలుగు మాటలే
నన్ను బతికిస్తున్నాయి.
ఇవి మనుషులకోసం తపిస్తున్న ఒక హృదయం చెప్పుకున్న మాటలు. కాలం గడిచిపోతూంటే, నిముషాలు, రోజులూ, సంవత్సరాలూ వేళ్ళ సందుల్లోంచి నీళ్ళల్లాగా జారిపోతుంటే, అన్నిటికన్నా ముందు సజీవమైన మనుషుల్తో కలిసి మాట్లాడుకునే జీవితం, ఆ సంభాషణ, ఆ అనుభూతి-వాటికోసం ఒక దాహార్తితో తపించిన కవితలు.
నాకు ఒక మనిషి, మాట. మనసు కావాలి
మనసున్న మనిషి మాట్లాడే మాటొకటి కావాలి.
ఉదయమో, సాయంత్రమో, రాత్రో
నన్ను బ్రతికించే మాటొకటి కావాలి.
మనసుతో మాట్లాడే మనిషొకరు కావాలి.
‘మనసుతో మాట్లాడటం’ ఇదీ మనం గుర్తుపెట్టుకోవలసిన మాట. ఎందుకంటే, ఈ రోజుల్లో ‘మోసకారితనంతో మాయచేయడమే మనిషితనం అయిన e-రోజులు’ అయిపోయాయి అంటాడు కవి. పొద్దుణ్ణుంచీ, రాత్రిదాకా తాను కూడా యాంత్రికంగా పనిచేస్తో, ఒక ఎలక్ట్రానిక్ పరికరంగా మారిపోతానేమో అనే వేదన ఈ కవిత్వానికి ఊటబుగ్గ. ఈ సమస్య కవిదే కాదు, భావుకుడైన ప్రతి ఒక్కరి ‘జీవుని వేదన’ కూడా.
అందుకని కవి తాను సజీవంగా స్పందించిన, ఊపిరి పీల్చిన, పలకరించిన, పలవరించిన ప్రతి క్షణాన్నీ ఎంతో పదిలంగా గుర్తుపెట్టుకున్నాడు. ప్రపంచంలో మనుషులంతా ‘అమ్మకందారులూ, కొనుగోలు దారులూ’ అనే రెండు వర్ణాలుగా, వర్గాలుగా, లింగాలుగా, దేశాలుగా మారిపోతున్న కాలంలో, ‘చిగురించే మనుషుల్ని’ వెతుక్కుంటున్నాడు. ఇలా అంటున్నాడు:
మనుషులు చిగురిస్తారు
మనుషులు ప్రవహిస్తారు, పరవశిస్తారు
ఏ దేశంలో అయినా , ఏ కాలంలో అయినా
మనుషులు మనుషులు కావటమే
మనిషి చరిత్ర.
కాని అలాంటి మనుషులు అంత సులభంగా తారసపడరు కదా. అందుకే ఇలా అనుకుంటున్నాడు:
ప్రేమించటమో, జీవించటమో
ప్రేమతో జీవించటమో
ఇదంతా..ఫేస్ బుక్కుల్లో
అకౌంట్ ప్రారంభించినంత సులభం కాదు కదా!
బాలాజీ అన్వేషణ మనుషుల గురించి. తనని తాను దర్శించుకోడానికీ, నిర్వచించుకోడానికీ మరొక మనిషి తప్పని సరి అని కవి నమ్మకం. ఈ మాటలు చూడండి:
నువ్వు ఏమిటో, నువ్వు ఏమి కాదో, చెప్పేది, తేల్చేది-
శోధించి, ప్రక్షాళన చేసి, మలినాలని కడిగి,
నిరంతరం నిన్ను మలచి పదును పెట్టేది
నీ ఎదుటిమనిషే..
నీ లోపలి మనిషీ!
టైలరు చొక్కా కుడుతున్నప్పుడు మిషనుసూదికి ఎక్కించిన దారం లోపలకి పోయి లోపలి దారాన్ని పైకి లాగినట్టు కవికి కనిపించే బయటి మనిషి అతణ్ణి స్పందింపచేసినప్పుడు అతడి లోపలి మనిషిని బయటికి తీసుకొస్తాడు. ఆ ఇద్దరూ ఒక్కలాంటి మనుషులే కావడం కవికి సంతోషాన్నిస్తుంది. తన లోపలి శిశువు సజీవంగా లేనప్పుడు మటుకే మనుషులు బయటి తనను తాను వెతుక్కుంటాడు అంటాడు కవి. ‘లోపలి శిశువును పోగొట్టుకున్న మనిషి లోచూపు లోపించిన మనిషి.’ అలాకాక, తనలోని శిశువిని కాపాడుకోగలిగినప్పుడు,
ఒకే సమయంలో
శిశువులుగా ఉంటూ కవులు
వీరులుగా అర్థమవుతారు
ఈ కవితలు బాలాజీ శిశుహృదయంతో రాసాడు కాబట్టే ఇందులో అధికభాగం కవితలు, అమ్మ గురించీ, తన పిల్లల అమ్మ గురించీ, తనకి అమ్మగా మారిన తన పిల్లల గురించీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. స్త్రీల గురించీ, తనని కడుపులో పెట్టుకుని చూసుకున్న తన తల్లి, సహచరి, కూతురుల గురించి కవి మాట్లాడినప్పుడల్లా మన హృదయంలో కూడా ఒక తంత్రి మృదుమధురంగా మోగడం మనకి వినబడుతుంది.
ఇల్లు, వంటిల్లు, హాలు, బాత్ రూమ్, పెరడు..
ప్రహారినుండి, ఇల్లు సమస్తం వారి సంరక్షణలోనే!
పుస్తకాలు, వస్తువులు, పరికరాలు, పరిసరాలు
ఇల్లుమొత్తం, ఇంట్లోని పరిమళాలన్నీ వాళ్ళే!
ఆదివారాలు, సెలవురోజులు, పండుగలు, పర్వదినాలూ వాళ్ళే!
కాఫీ కప్పులు, టీగ్లాసులు, అన్నం పళ్ళాలు
ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు,
మందులు, మాత్రలు, లేపనాలు, బి.ఇ.మిషిన్లు, ధర్మామీటర్లూ వాళ్ళే!
ఇంట్లో వాళ్ళు కానిది ఏమీ లేదు,
వాళ్ళు లేనిదే ఏమీ లేదు!
ఇంత శక్తిమంతమైన కవితావాక్యాలు బహుశా నేనొకప్పుడు వాల్ట్ విట్మన్ లో మాత్రమే చూడగలిగాను.
కవిత్వం పూర్తిగా హృదయభాష అయినప్పుడు దానికి మరే అలంకారాలతోనూ పనిలేదు. అత్యంత స్వభావోక్తి అత్యంత కవితామయంగా వినిపిస్తుంది. చూడండి, ‘పాయసం’ అనే కవిత మొదలుపెడుతూనే మొదటివాక్యం-
ప్రేమించేవాళ్ళు కాబట్టి
వాళ్ళు అట్లాగే ఉంటారు.
చుట్టూ ఉన్న సమాజంలోనూ, తమ తమ జీవితాల్లోనూ మానవత్వాన్ని పునఃప్రతిష్టించాలంటే ఏమి చెయ్యాలి? ఈ కవి దృష్టిలో, చెయ్యవలసిందల్లా, తన లోపలి మనిషితో బయటి మనిషిని వెతుక్కోడమే. అటువంటి విద్య నేర్పడమే సాహిత్యప్రయోజనం, సాహిత్య సంస్కారం. ఈ వాక్యాలు చూడండి:
ఇప్పుడు దేశమంటే
ప్రతి మనిషి స్వేచ్ఛగా పనిచేయాల్సిన ఒక జీవావరణం
దేశమంటే బావులు, చెరువులు, పంటపొలాలు
గ్రామగ్రామాలు, పల్లెలు, పట్టణాలు, మహానగరాలు
అక్కడక్కడా.. ఇంకా సజీవంగా ఉన్న సంస్కారాలు..
అలా సజీవంగా ఉన్న సంస్కారం కవిహృదయాన్ని అంటిపెట్టుకుని ఉందికాబట్టే, అతడిలా అంటున్నాడు:
ఆకాశమంత ప్రేమతో
ఆకాశమంత విశ్వాసంతో, ఆకాశమంత మనసుతో
అందరినీ కావాలనుకుంటాడు కవి
అందరినీ కలవాలనుకుంటాడు కవి.
కవికి స్పష్టంగా తెలుసు:
లోకంలో అపురూపమైనవి కొన్నే
మనుషులూ, క్షణాలూ, ప్రేమలు, కన్నీళ్ళు
ఈ మెలకువతోనే అహరహం జీవిస్తున్నాడు కాబట్టే అతడి సుఖదుఃఖానుభవాల్తో మనం కూడా తాదాత్మ్యం చెందగలుగుతున్నాం. ఆదికవికి శోకం శ్లోకంలోకి పర్యవసించిందని మనకు తెలుసు. ఈ కవికి మౌనం కూడా శ్లోకంగా పరిణమించింది. చూడండి, ఈ మొత్తం సంపుటిలో అద్భుతమైన వాక్యాలు నాలుగు మాత్రమే ఎత్తి చూపమంటే నేనీ వాక్యాలవైపు చూపిస్తాను:
ఉన్నట్టుండి ఫోన్ వస్తుంది.
‘ఏమ్మా’ అంటాను
ఏం లేదంటుంది.
‘ఎందుకమ్మా’ అంటాను.
‘ఏం లేదు.. ఊరికే..’ అంటుంది.
3
ఆ రాత్రి మేము పలమనేరు చేరుకునేటప్పటికి రాత్రి పదయ్యింది. వారిజ వేడి వేడి అన్నంలో సెనక్కాయల పచ్చడి కలిపి పెట్టింది. నా చెల్లెలు పెట్టిన ఆ అన్నం రుచి ఇప్పటికీ ఎంత తాజాగా అనిపిస్తున్నదో, ఈ కవితలు కలిగించిన స్ఫూర్తి కూడా ఎప్పటికీ అంతే తాజాగా ఉంటుందని చెప్పగలను.
8-11-2023


చాలా ఏండ్ల క్రితం ఏనుగుల బెడద గురించి బాలాజీ గారు రాసిన కథొక దానిని విశ్లేషించిన గుర్తు. ప్రభుత్వాలు రచయితల కథలు చదివి సమాజాభివృద్ధికి తగిన చర్యలు గైకొనడానికి ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పరచాలని నేను రాసినగుర్తు. తరువాత అదే పలమనేరు బాలాజీ గారి జనప్రియ సాహిత్యం గురించి రాసిన వ్యాసానికి జవాబుగా ఒక వ్యాసం రాసి పోస్టు చేయకుండా ఇప్పటికీ నా పాత రాతల ఫైల్లో భద్రంగా ఉంది. అందులో మామూలు చదువరిని
మంచి పాఠకుడిగా మార్చటంలో జనప్రియ సాహిత్యం పాత్ర గురించి చర్చించాను . వారి కథలు అప్పట్లో నాకు సామాజిక స్పృహ కలిగిన కొత్త ఆలోచనలతో రాసినవిగా అనిపించాయి. ఇప్పుడు మీరు పరిచయం చేస్తున్న కవితలు చదువుతుంటే
మామూలు మాటల తోనే మామూలు విషయాలను స్పృశిస్తూ మంచి కవిత్వం ఎలా పుట్టించవచ్చో అవగతమౌతున్నది. నిరంతర సాహిత్య శ్వాస కలిగిన వారి, మానవీయ దృక్పథం కలిగిన వారి రచనలు తప్పక ఆదరణీయమౌతాయి. వారికి మీకు అభినందనలు.
కవితలు ఇంకా చదవలేదు. సమీక్ష చదివాక
కవితా వాక్యాలు చుట్టూరా పరిభరామిస్తున్నాయి. కవికి, సమీక్షకులు కి అభినందనలు
ధన్యవాదాలు