సచ్చిదానందమూర్తి తత్త్వశాస్త్ర ఆచార్యుడు. జీవితకాలంపాటు విశ్వవిద్యాలయాల్లో తత్త్వశాస్త్రం బోధిస్తో ఉన్నారు. కాని ఆయన ఉద్యోగజీవితంలో ఉన్నప్పుడూ, ఉద్యోగ విరమణ తర్వాతా, మరీ ముఖ్యంగా తన చివరి సంవత్సరాల్లో మొదటి తరహా తాత్వికుడిగా జీవించారు. ఆయనలో అన్నిటికన్నా విశిష్టమైన అంశం అదే.
వేదార్థ మీమాంస
సమకాలీన భారతీయ దార్శనికుల్లో అగ్రేసరుడైన డా.కొత్త సచ్చిదానందమూర్తి వేదాలను అర్థం చేసుకోవడానికీ, వ్యాఖ్యానించడానికీ చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. వేదాలపై ఇంతదాకా వచ్చిన ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యాఖ్యానాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, అయినప్పటికీ, ఆయన వేదాలను అర్థం చేసుకోవడం కోసం ప్రధానంగా నిరుక్తం వైపూ, పూర్వ ఉత్తర మీమాంసల వైపూ, స్మృతి, ఇతిహాస, పురాణాల వైపూ, సాయణుల వైపూ, ఇతర భాష్యకారుల వైపూ మొగ్గు చూపడం ఈ రచనలో విశేషం.
