జయదేవుడు కూడా తన గీతాలు 'కేశవ కేళి రహస్యాన్ని' గానం చేస్తున్నాయని చెప్పుకున్నాడేగాని, తాను 'కేశవదాసి' ని కాగలిగానని చెప్పుకోలేదు. ఆ ఒక్క పదంతో అన్నమయ్య శాశ్వతంగా స్వామి చరణాల దగ్గర తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడు.
తిరుమలలో పొంగిపొర్లే సముద్రం
చాలా రాయాలి. ఈ సంపుటంలోని ఎన్నో కీర్తనల్లో కనిపిస్తున్న భాషా వైభవంతో పాటు భావవైభవం గురించి కూడా రాసుకోవాలి. 'అతిశయుండను వేంకటాద్రీశుడను మహాహితుణ్ణి' తన చిత్తమంతా నింపుకుని అన్నమయ్య మాలగా గుచ్చిన ప్రతి ఒక్క పాట గురించీ మాట్లాడుకోవాలి. 'తిరువేంకట గిరిపతి యగు దేవశిఖామణి పాదము శరణని బ్రదుకుటతప్ప' మరొక 'సన్మార్గం' లేదని పరిపూర్ణంగా నమ్మి పాటలతో పూజించిన పాటకారుడి గురించి బహుశా ఒక జీవితకాలం పాటు మాట్లాడుకుంటూనే ఉండాలి.
