ఈ పుస్తకం చదవడం పూర్తికాగానే, ఒక అపూర్వ చారిత్రక గ్రంథాన్ని చదువుతున్నట్లు, ఆయాకాలాల సామాజిక, సాంస్కృతిక చరిత్రను అవగాహన చేసుకుంటున్నట్లు, సాహిత్య సంగీత శిల్ప చిత్రలేఖనాది కళలను ఆస్వాదిస్తున్నట్లు, స్వచ్ఛమైన నదీజలాల్లో తేలియాడుతున్నట్లు, దిగంతపరివ్యాప్త సందేశ సాన్నిధ్యాన్ని కలిగించే పర్వతాలనధిరోహించినట్లు, ఎన్నో యుగాల రహస్యాలను అందించాలని తహతహలాడుతున్న ఆరణ్యక ప్రాకృతిక సౌందర్యాల వెన్నెలలో తడిసినట్లు అనుభూతిని చెందడం మాత్రం సత్యం.
యాత్రా సాహిత్యం
తెలుగుసమాజం ఇప్పుడు అత్యంత ప్రాపంచిక సమాజం. మనుషులు వ్యక్తులుగానూ, సమాజంగానూ కూడా ఇంత వ్యాపారధోరణిలో కూరుకుపోయిన చోటు భారతదేశంలో నాకు మరెక్కడా కనిపించడంలేదు. ఈ కైదునుంచి తెలుగుజాతిని బయటపడేయాలంటే మహాయాత్రీకులు మరింతమంది పుట్టుకు రావలసి ఉంటుంది.
