కాని వానాకాలం రాముడిలోని మనిషి బయటపడే కాలం. కాబట్టి రాముడే 'చూడు మనం చెప్పుకుంటున్న ఆ వానాకాలం సమీపించింది' అని అనడంలో కూడా గొప్ప ఔచిత్యం ఉంది. ఎందుకంటే ఆ వర్షర్తువర్ణన మొత్తం ఒక భావుకుడైన మానవుడు, అసలే రసార్ద్రహృదయుడు, మరింత రసార్ద్రభరితుడై చేసిన వర్షస్తోత్రంలాగా మనకి వినిపిస్తుంది.
వెలుగు రాజ్యం చేసే కాలం
అంత మృదు ఋతుగానంలో ఆయనకి శస్త్రం ఎందుకు స్ఫురించింది? ఆ తర్వాత రానున్నది యుద్ధకాండ కాబట్టి అనుకోవాలా? కాదు. ఒక మనిషి మనసు ప్రసన్నం కావడమంటే చీకట్లు తొలగి దిక్కు తోచడం. తనని చుట్టుముట్టిన చీకట్లని చీల్చుకోడానికి ఒక శస్త్రం దొరకడం. శరత్కాలమంటే ఒక ఖడ్గసృష్టి. శస్త్రంలా శరత్కాలం సాక్షాత్కరించాక జైత్రయాత్ర ఎలానూ మొదలు పెట్టక తప్పదు.
రాముడు నడిచిన దారి
కాని రామాయణంలో ఉండే విశిష్టత ఏమిటంటే, వాల్మీకికి పూల గురించి మాత్రమే కాదు, ఏ పూలు ఎప్పుడు పూస్తాయో, ఏ పూలు ఎక్కడ పూస్తాయో కూడా తెలుసు. వసంత శోభని వర్ణించినప్పుడు మాత్రమే కర్ణికార పుష్పాల గురించి వర్ణిస్తాడు.
