నరకాగ్నికి సెలవు

అవును. నరకాన్ని కూడా ధిక్కరించగలవి పువ్వులు మాత్రమే. వాటికి తెలుసు, జీవించేది ఒక్కరోజు మాత్రమే. వాటికి మృత్యుభయం లేదు. రేపెలా గడుస్తుందన్న చింతలేదు. ఈ సాయంకాలానికి వాడి నేలరాలిపోతామన్న దిగులు లేదు. వాటికి తెలిసింది ఒక్కటే, ఆ క్షణం, తాము విప్పారుతాయే, ఆ క్షణం, తమ సమస్త అస్తిత్వంతో, ఆనందంతో, లోపల్నుంచీ ఉబికి వచ్చే ధగధగతో, పూర్తిగా, పరవశంతో, అజేయమైన ఆత్మబలంతో, తాము తాముగా పూర్తిగా విప్పారడం. అలా విప్పారిన క్షణం అవి భూమ్మీద స్వర్గాన్ని వికసింపచేస్తాయి. ఆ తర్వాత అవి ఉంటే ఏమిటి? రాలిపోతే ఏమిటి? కనీసం ఆ క్షణం, ఆ ఒక్క క్షణం, నరకలోకం తలుపులు మూసుకుపోతాయి.

శ్రీపర్వతప్రకరణం

అది తెలుగులో మొదటి యాత్రాకథనం. రామాయణ, మహాభారతాల్ని వదిలిపెడితే, భారతీయ భాషాసాహిత్యాల్లో అటువంటి తీర్థయాత్ర కథనం మరొకటి కనిపించదు. అది తెలుగు కథనం మాత్రమే కాదు, అందులో గీర్వాణ, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర దేశాల భక్తుల కీర్తనలు కూడా ఉన్నందువల్ల భారతీయ సాహిత్యంలోనే మొదటి బహుభాషా యాత్రాకథనం కూడా.