నాట్యధర్మి, లోకధర్మి

మొన్న ఒక సాహిత్యసభలో నన్ను వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఓ మిత్రురాలు ‘ఏమి నేల తల్లీ, ఇది పనికిరాని బీడు’ పాట గుర్తుచేసింది. ఆ మాటలు వింటూనే నేను ఉలిక్కి పడ్డాను. ఎన్నాళ్ళయినా ఈ పాట నాతో ప్రయాణం చేస్తూనే ఉందే అనుకున్నాను.
 
రాజమండ్రిలో ఒకప్పుడు టి.జె.రామనాథం అనే గొప్ప రంగస్థల ప్రయోక్త ఉండేవాడు. గురజాడ కళా సమితి అనే సంస్థ ద్వారా అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప రూపకాల్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. ధవిళేశ్వరంలో ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రాజమండ్రి సాహితీవేదికలో సభ్యుడు. ఆయన్ని మిత్రులంతా ‘గురువు’ గా పిలుస్తూండేవారు, కొలుస్తుండేవారు.
1983 లో నన్నయ సహస్రాబ్ది ఉత్సవాలు రాజమండ్రిలో ఘనంగా జరిగేయి. ఆ సందర్భంగా మా మిత్రుడు మహేశ్ రామనాథంతో కలిసి ‘నన్నయ భారత రచన’ అనే ఒక డాక్యుమెంటరీ రూపకం రూపొందించాడు. డాక్యుమెంటరీ రూపకం దశవిధ రూపకాల్లోనూ లేని పదకొండో ప్రక్రియ. అందులో సాంప్రదాయిక నాటకసన్నివేశాలతో పాటు, సంగీతం, నాట్యం, షాడో ప్లే, మైమ్ లతో పాటు ఫ్లాష్ బాక్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఆధునిక నాటకరంగంలో సురభి కళాకారుల తరువాత రంగస్థలాన్ని అంతగా ఆకట్టుకునేలాగా రూపొందించగలిగింది రామనాథమే అనుకుంటాను.
 
నన్నయ భారత రచన గొప్ప హిట్. ఆ రోజుల్లో ఆ బృందం హైదరాబాదు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ముందు కూడా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. కాని ఆ ప్రదర్శన చాలా కర్చుతో కూడిన పని. ఒకసారి ప్రదర్శనకే ఆ రోజుల్లో లక్షనో, రెండు లక్షలో అయ్యేది. ఆ సొమ్మంతా మా మిత్రుడు సమాచారం సుబ్రహ్మణ్యం ఎవరో స్పాన్సరర్ల ద్వారా పట్టుకొచ్చేవాడు.
 
ఆ మరుసటి ఏడాది కూడా మళ్ళా ఆ రూపకాన్ని మరోసారి ప్రదర్శించాలని ఆలోచనలు జరుగుతున్నప్పుడు రామనాథం తనకి మరో కొత్త సబ్జెక్టు చేయాలని అనిపిస్తోందని చెప్పాడు. దేని మీద చేస్తే బావుంటుంది? అనేక సామాజిక సమస్యలమీద ఆయన అప్పటికే ‘నరకం మరెక్కడో లేదు’, ‘గోగ్రహణం’, ‘భయం’ లాంటి రూపకాలు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఎందుకు వచ్చిందో గాని ఆ ఆలోచన, సుబ్బూ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకంగా మార్చి ప్రదర్శిస్తే బాగుంటుందని అన్నాడు. రెండున్నర వందల ఏళ్ళ చరిత్ర. గంటన్నర రూపకంగా మార్చాలి. రామనాథానికి అందులో ఛాలెంజి అర్థమయింది. చెయ్యాల్సిందే అన్నాడు.
 
మరి రచయిత?
 
‘ఇడుగో’ సుబ్బూ నన్ను చూపించాడు.రామనాథం నాకేసి చూసాడు. అప్పటికి నాకు ఇరవై రెండేళ్ళు. సరే అన్నాడు.
 
నేను చాలా సంతోషంగా ఆ మర్నాటికల్లా ఇరవై ముప్పై పేజీల రచన చేసి తీసుకువెళ్ళి సుబ్బూకి చూపించాను. వాడు ‘చాలా బాగుంది. కాని గురువుతో ఇలా నడవదు. ఆయన రిహార్సల్సు మొదలుపెట్టాక ఈ స్క్రిప్టు మార్చుకుంటూ పోతాడు. కాబట్టి నువ్వు రోజూ ఆ రిహార్సల్స్ లో ఆయన దగ్గర ఉండాలి’ అన్నాడు. రిహార్సల్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ అన్నాను. ‘ధవిళేశ్వరంలో. రోజూ రాత్రి పదింటికి మొదలై తెల్లవారేదాకా జరుగుతాయి. బహుశా నెల్లాళ్ళపాటు జరుగుతాయి’ అన్నాడు.
 
నా గుండెలో రాయి పడింది. రోజూ పగలంతా ఆఫీసు పనిచేసుకుని రాత్రికి ధవిళేశ్వరం వెళ్ళి, తెల్లవారేదాకా అక్కడ గడిపి మళ్ళా మర్నాడు ఆఫీసుకి వెళ్ళాలా? కాని ఏమి చెయ్యను? అది వాళ్ళతో ఉన్న అనుబంధమో లేకపోతే ఆ రోజుల్లో ఉండే ఉత్సాహమో తెలియదు. రోజూ సాయంకాలం నేనూ, మహేశ్ సైకిళ్ళ మీద ధవిళేశ్వరం వెళ్ళి ఆ రాత్రంతా రిహార్సల్స్ లో గడిపి ఏ తెల్లవారు జామునో గోదావరి గట్టమ్మట పేపరు మిల్లు బాట పట్టేవాళ్ళం.
 
జాతీయోద్యమం మీద నేను రాసిన ఆ రూపకానికి ‘స్వాతంత్ర్యోద్యమ శంఖారావం’ అని పేరుపెట్టాం. దానిలో వీలైనన్ని జాతీయ గీతాలు ఉండాలనుకున్నాం. కొన్ని లబ్ధప్రతిష్టులవీ, కొన్ని అంతగా నలుగురికీ తెలియనివీ. కొన్ని మేము రాయాలనుకున్నవీ.
 
రూపకం మొదలవుతూనే భారతదేశ గతాన్ని తలుచుకుంటూ ఒక గీతం ఉండాలనుకున్నాక, ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు ‘ కన్నా మించిన గీతం మరేముంటుంది? వందేమాతరం గీతంలో ఈ నాటి తరాలకి అంతగా తెలియని పంక్తులు
 
త్రింశత్కోటి కంఠ కలకలనినాద కరాలే
ద్విత్రింశత్కోటి కరైధృతకరకరవాలే
కే బోలే మా తుమి అబలే?
 
(ముప్పై కోట్ల కంఠాలు నినదిస్తుండగా, అరవై కోట్ల భుజాలు ఖడ్గాలు ధరించిఉండగా, ఎవడమ్మా నిన్ను అబల అన్నది?)
 
అనే వాక్యాలు తీసుకున్నాం. ఇక ‘భరతఖండంబు చక్కనిపాడియావు’, ‘మాకొద్దీ తెల్లదొరతనమూ ‘, ‘వీరగంధము తెచ్చినారమూ’, ‘పాడవే రాట్నమా ప్రణవ భారతగీతి ‘వంటి గీతాలు ఉండకుండా ఎలా ఉంటాయి? బసవరాజు అప్పారావు గీతం ఒకటైనా పెట్టుకున్నామో లేదో గుర్తు లేదు గాని, జలియన్ వాలా బాగ్ దురంతాన్ని చిత్రిస్తున్నప్పుడు, కొండపల్లి జగన్నాథ దాసు గారు రాసిన, గుండెల్ని కరిగించే ఈ పాటని ఎంచుకున్నాం.
 
కనుల నీరు కారునుగా కరుణలేక యా
డయ్యరొనర్చిన వధ వినిన
జలియన వాలా బాగున చచ్చిన
జనము లెక్క లేదుకదా
అబలలు బాలకులెందరీల్గిరో
అసలే తెలియదుగా.
 
ఇక జాతీయోద్యంలో పందొమ్మిదో శతాబ్దపు ముఖ్యఘట్టాలకోసం అవసరమైన పాటలు నేను, ఇరవయ్యవ శతాబ్దపు ముఖ్య ఉద్యమాల మీద మహేశ్ పాటలు రాయాలనుకున్నాం. మహాత్ముడు నిర్వహించిన మూడు ముఖ్యమైన ఉద్యమాలు సహాయనిరాకరణం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియాలతో పాటు నేతాజీ ఛలో డిల్లీ పిలుపు మీద కూడా అతడు పాటలు రాసాడు. ఆ పాటలు నాకిప్పుడు గుర్తు లేవుగాని, దండి యాత్ర మీద అతడు రాసిన పాట పల్లవి నా మనసులో నాటుకుపోయింది.
 
‘దండి కడలి తీరంలో సూర్యోదయమవుతోంది
తెల్లవారి పాలన ఇక అస్తమించబోతోంది’
 
అప్పట్లో ఆంధ్రకేసరి పైన సినిమా వస్తే, ఉప్పు సత్యాగ్రహం మీద ఒక పాట తప్పకుండా ఉంటుందని ఊహించి, పరుగున పోయి చూస్తే, శ్రీ శ్రీ పాట:
 
‘పదండి దండు దండుగా పదండి దండయాత్రగా
ప్రకాశ సింహ గర్జనల్ దిగంతరాలు నిండగా’
 
ప్చ్! శ్రీ శ్రీ తేలిపోయాడనిపించింది. ఆయన ఆ పాట మరీ ‘ప్రొఫెషనల్ ‘గా రాసాడు. నా మిత్రుడి వాక్యాల్లో ఉన్న స్ఫూర్తి అందులో లేదు. ‘దండి కడలి తీరంలో సూర్యోదయమవుతోంది’ అంటున్నప్పుడు దండి భారతదేశానికి పడమటి దిక్కున ఉన్నదనీ, అక్కడ ఉప్పుసత్యాగ్రహం వల్ల పడమటి దిక్కున సూర్యోదయమవుతున్నట్టుందనే స్ఫూర్తి ఉందందులో. అంతేకాదు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యోదయమవుతున్నదంటే సూర్యాస్తమయం అయిపోయిందనే కదా. ఇలా చాలా ఉంది ఆ రెండు వాక్యాల్లో.
 
నేను నాలుగో అయిదో పాటలు రాసాను. అందులో గాంధీజీ భారతదేశానికి రాకముందు ప్రాణాలు అర్పించిన టెర్రరిస్టు వీరుల్ని స్మరిస్తూ ఒక పాట:
 
అనల కిరీటం అనల కిరీటం
శతఘ్ని ఎదటనె స్వేచ్ఛాగానం
కారాగారం, బహిష్కారం
ఉరికంబాలూ లెక్కకు రావు.
 
లేతబుగ్గలు, రంగుల కలలు
అగ్నినాల్కల మృత్యువు కౌగిలి
రుధిర ప్లావిత స్వరాజ్యపుష్పం
అమ్మ కొప్పులో అలంకరిద్దాం.
 
అమర్ రహే ఇక అమర్ రహే
అమర్ రహే అమర్ రహే.
 
ఇన్నాళ్ళయ్యాక వెనక్కి చూసుకుంటే ఇందులో మాత్రలు తప్పినట్టు కనిపిస్తోందిగాని, ఆ లోటు ఏ మాత్రమూ తెలియకుండా అద్భుతంగా స్వరపరిచాడు నాగేశ్వర రావు అనే వయొలిన్ మాంత్రికుడు. మహోజ్జ్వలంగా గానం చేసాడు నా మిత్రుడు ఎర్రాప్రెగడ.
 
మరొక రెండు పాటలు కాక, ఇదిగో మొన్న మళ్ళా విన్నానే ఆ పాట ‘ఏమి నేల తల్లీ ఇది పనికిరాని బీడు ‘ అనే పాట కూడా రాసాన్నేను. 1757 లో ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ గెలిచి భారతదేశంలో వలసపాలన మొదలయినప్పుడు ఎవరో జోస్యం చెప్పారుట, కంపెనీ పాలన వందేళ్ళు కొనసాగుతుందని. 1857 తిరుగుబాటుకి ప్రోద్బలం కలిగించిన శక్తుల్లో ఆ నమ్మకం కూడా ఒకటని చెప్తారు. 1757 నుంచి 1857 దాకా ఆ నూరేళ్ళ కాలం అత్యంత దారుణమైన కాలం. ఆ వందేళ్ళ దోపిడీనీ, అది ఒక స్వయంపోషక ఆర్థిక వ్యవస్థను ఎట్లా ఛిన్నాభిన్నం చేసిందో వివరిస్తూ రాసిన పాట అది. అంతేకాదు, నాటకం దృష్ట్యా, వందేళ్ళ కథని వడివడిగా చెప్పుకుపోవడానికి ఒక అవకాశం కూడా. ఆ పాటలో రెండవ వాక్యంలో ‘ఇది సమాధి రాళ్ళ వీడు’ అనే మాటలు మహేశ్ వి. తక్కిందంతా నా పాట:
 
ఏమి నేల తల్లీ ఇది పనికిరాని బీడు
ఇది రత్న గర్భ కాదు, సమాధి రాళ్ళ వీడు
ఎటుల జరిగెనమ్మ ఆ ఘోర దారుణమ్ము
అది పలకలేదు భాష, నూరేళ్ళ దీన ఘోష.
 
ప్రతి పల్లెసీమలోన పాడేటి కదురులేవి
సంద్రాల ఆవలున్న యంత్రాలు మింగెనమ్మ
అందాల బరిణ పట్టె మజిలీను చీరలేవి
తెగినట్టి బొటనవేళ్ళ చేనేతవారినడుగు.
 
ముత్యాల రాశులమ్మే బాజారు వీథులేవి
తిండిలేక మాడే కంకాళ కోటినడుగు
ఆడాళ్ళ పసిడి నగలు ముంజేతి మురుగులేవి
తాకట్టు ఊబిలోన ఒకటొకటి జారెనమ్మ.
 
బలోపేతులైన నవయువకులేరి తల్లీ
మనవాళ్ళు తెచ్చినట్టి జగడాలపోరు నడుగు
గంధర్వగానములతో రంజిల్లువారలేరి
బానిసలుగ మార్చి నిర్జించినారు తల్లీ.
 
ఇంతపీడలోన మేమెట్లు బతకగలము
దేవుడన్నవాడు చూపించలేడ జాలి
కొత్త జీవితమ్ము అది దేవుడివ్వలేడు
తిరుగుబాటు చేసి తేవాలి దాన్ని తిరిగి.
 
చిన్నప్పుడే ఇంటినుంచి వెళ్ళిపోయి ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమగీతాలు పాడుకుంటూ కనిపించే పిల్లవాణ్ణి చూసినట్టుంటుంది ఈ పాట విన్నప్పుడల్లా.
 
2
 
స్క్రిప్టు రాయడమైతే రాసేసానుగానీ, దాన్ని రామనాథం రిహార్సల్సు చేస్తున్నప్పుడు సానబెట్టుకుంటాడని సుబ్రహ్మణ్యం చెప్పాడు కదా, ఆ ప్రక్రియ నన్నెంత రాచి రంపాన పెట్టగలదో మొదటిరోజే అర్థమయింది. ఆయన తన బృందాన్నంతా కూచోబెట్టుకుని, ఆ స్క్రిప్టు గురించి నన్ను వాళ్ళకి వివరించమన్నాడు. ఆ ఇతివృత్తం ఏమిటో స్థూలంగా అర్థమయ్యేక, మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించడం మీద దృష్టి పెట్టాడు.
 
‘మీరు రాసిన మొదటి పేరా వినిపించండి’ అన్నాడు
.
‘భారతదేశం మీద ఎన్నో దండయాత్రలు. మొదటినుండీ ఎందరో విదేశీయులు, అరబ్బులు, మంగోలులు, చివరికి ఐరోపావాళ్ళు కూడా..’
 
‘అబ్బే’ పెదవి విరిచేసాడు రామనాథం, నా మొదటి వాక్యం కూడా పూర్తి కాకుండానే.
నాకు అర్థం కాలేదు.
 
‘ఇలా రాస్తే ఎలా సామీ. నువ్వు వ్యాసం రాసుకొచ్చేవు. నాకు కావలసింది నాటకం. చూపించే స్క్రిప్టు కావాలి నాకు. నువ్వు చదువుతూ ఉంటే మా కళ్ళముందు ఆ దృశ్యాలు కనిపించాలి ‘ అన్నాడు.
నాకు తలతీసేసినంత పనయింది. ఉక్రోషం కూడా వచ్చింది. కాని ఆయనేమంటున్నాడో కూడా అర్థమయింది.
 
‘మంచిది, ఇప్పుడే మరొక వెర్షన్ రాసిస్తాను చూడండి’ అన్నాను. అక్కడే ఒక నోటు పుస్తకంలోంచి కాగితాలు చింపి బరబరా నాలుగు వాక్యాలు రాసిచ్చేను.
 
‘ఏదీ చదవండి’ అన్నాడు.
 
‘భారతదేశం మీదకి ఈసారి శత్రువు కైబరు కనుమల్లోంచి రాలేదు. ఓడమీంచి దిగేడు. ఒక చేత్తో కత్తీ, మరో చేత్తో శిలువా పట్టుకు దిగేడు. జహంగీర్ చక్రవర్తి ఆస్థానంలో సర్ థామస్ రో మోకాళ్ళ మీద వంగి సలాం చేసి వర్తకానికి అనుమతి యాచించినప్పుడు తెలియలేదు, మహారాజా రంజిత్ సింగ్ గుర్తుపట్టాడు ఆ పెను విపత్తుని. అక్కడక్కడా ఎర్ర రంగు పులిమిన భారతదేశ పటాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ వృద్ధ చక్రవర్తి అన్నాడట: సబ్ లాల్ హో జాయేగా అని.’
 
‘వెరీ గుడ్’ అన్నాడు రామనాథం. నన్ను చూసి కళ్ళెగరేసాడు. ‘నువ్వు నాకు సరిపోతావు. వండర్స్ చేద్దాం మనం’ అన్నాడు. సుబ్బూ కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం.
 
కాని ఆ ఆనందం నాలుగు రోజులు కూడా నిలబడలేదు.
 
ఈసారి గాంధీని పరిచయం చేసే ఘట్టం. ఆ రూపకంలో ప్రసిద్ధ కవి వసీరా గాంధీ వేషం వేసాడు. ప్రముఖ రాజకీయవేత్త, పార్లమెంటేరియన్ అరుణ్ కుమార్ నెహ్రూ వేషం వేసాడు. గాంధీని మొదటిసారి రంగస్థలమ్మీద ప్రవేశపెట్టే దృశ్యం. దాన్ని ఒక ఛాయాదృశ్యంగా చూపించాలని దర్శకుడి ఊహ.
 
‘1915 లో బొంబాయి ఓడరేవులో మోహన్ దాస్ కె గాంధీ అనే బారిష్టరు అడుగుపెట్టినప్పుడు..’ ఇలా సాగుతుంది వాయిస్ ఓవర్. ఆ మాటలు వినిపిస్తుండగా, అంగవస్త్రంతోనూ, చేతిలో కర్ర, మొలన వేల్లాడే జేబు గడియారంతో గాంధీజీ నీడను తెరమీద చూపించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.
నేనుండబట్టలేకపోయాను. ‘ఇది అన్యాయం’ అన్నాను.
 
‘ఎందుకని’ అనడిగాడు దర్శకుడు నాకేసి చూడకుండానే.
 
1915 లో గాంధీజీ భారతదేశానికి వచ్చినప్పుడు ఆహార్యం అది కాదు. ఆయన కథియవాడు పంచెకట్టుతో, పూర్తి చేతుల చొక్కాతో, తలపాగాతో దిగాడు. ఈ అంగవస్త్రమూ, కళ్ళద్దాలూ, చేతికర్రా అప్పటివి కానేకావు’ అన్నాను.
 
‘అయితే ఏమిటట?’
 
నాకు వళ్ళు మండిపోయింది. ‘మీరు చరిత్రని చూపిస్తున్నారా? మీకు నచ్చింది చూపిస్తున్నారా? చరిత్ర చూపించాలనుకుంటే నన్నడగండి. మీకు నచ్చినట్టు చూపించాలనుకుంటే నాకిక్కడ పనిలేదు. వెళ్ళిపోతాను.’
 
రామనాథం నా వైపు చూసాడు. నన్ను అనునయించే ప్రయత్నం చేసాడు.
 
‘చూడమ్మా, నేను చరిత్రని ప్రదర్శించాలనుకోవడం లేదు. చరిత్రలో ఏది చూపిస్తే ప్రేక్షకులకి స్ఫూర్తి కలుగుతుందో, ఎలా చూపిస్తే వాళ్ళు స్పందిస్తారో అది మటుకే చూపించాలనుకుంటున్నాను. నాలాంటి అసంఖ్యాకులైన ప్రేక్షకులకి గాంధీ అంటే తెలిసింది ఆ రూపమే. అసలు సగటు ప్రేక్షకుడికి ఇండిపెండెన్స్ మూవెమెంట్ అంటే తెలిసింది గాంధీ ఒక్కడే. నాటకం మొదలయి ఇప్పటికి అరగంట గడిచిపోయింది. ఇప్పటికే ప్రేక్షకుడు గాంధీ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు. తీరా ఆ పాత్ర ప్రవేశపెట్టే సమయానికి నువ్వు చెప్పినట్టు పంచే, చొక్కా, తలపాగాతో గాంధీని చూపించాననుకో, ప్రేక్షకుడు డిసప్పాయింట్ అవుతాడు. ఆ తర్వాత నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా ఉపయోగం ఉండదు. అర్థం చేసుకో’ అన్నాడు.
 
కాని నేను వినలేదు. ‘మిమ్మల్ని ఎవడూ ఏమీ అనడు. ఈ స్క్రిప్టు రాసినవాడెవడు అన్ని నన్ను విమర్శిస్తారు. నా స్క్రిప్టు నాకిచ్చెయ్యండి. వెళ్ళిపోతాను’ అన్నాను.
 
రామనాథం సుబ్బూకేసి నిస్సహాయంగా చూసాడు. సుబ్బూ నాకేదో చెప్పబోయే లోపు మళ్ళా రామనాథమే అన్నాడు కదా:
 
‘పోనీ ఒక పనిచేద్దాం. ఈసారికి నన్ను ఇలా చెయ్యనివ్వు. నాటకం ఆడినరోజున నువ్వు ఆడియెన్సులోకి వెళ్ళి చూడు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో చూడు. నేనూహించినట్టు లేకపోతే, మళ్ళా నాటకం వేసినప్పుడు నువ్వు చెప్పినట్టే చేస్తాను ‘ అన్నాడు.
 
1984 ఆగస్టు పదిహేను రాత్రి ఆ నాటకాన్ని రాజమండ్రిలో శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మొదటిసారి ప్రదర్శించినప్పుడు, నేను కూడా కిక్కిరిసిపోయిన ప్రేక్షకుల మధ్య ఎక్కడో ఒంటి కాలిమీద నిలబడగలిగే పాటి చోటు సంపాదించిచూడటం మొదలుపెట్టాను. తీరా ఆ సన్నివేశం రానే వచ్చింది. ‘1915 లో బొంబాయి ఓడరేవులో మహాత్మా గాంధీ అడుగుపెడుతున్నప్పుడు..’ వాయిస్ ఓవర్ కి అనుగుణంగా విశాలమైన తెరమీద ఒక పక్కనుంచి అంగవస్త్రంతో, ముక్కుమీదకి జారుతున్న కళ్ళద్దాలూ, చేతికర్రతో ఒక నీడ కనిపించగానే కళాకేంద్రమంతా చప్పట్లతో మార్మ్రోగిపోయింది. ఆ ఛాయారూపం తెరకి ఈ కొసనుంచి ఆ కొసకి వెళ్ళేదాకా ఆ చప్పట్లు అట్లా మార్మ్రోగుతూనే ఉన్నాయి.
 
రామనాథాన్ని జనరంజక ప్రయోక్త అని రాసానొకచోట. ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడల్లా మహేశ్ ఆయన్ని కె.వి.రెడ్డితో పోల్చేవాడు. తాను పెట్టుకున్న ప్రమాణాల స్థాయికి ప్రేక్షకులు రావాలని కోరుకునే బి.ఎన్.రెడ్డి కన్నా, పండిత పామర రంజకంగా చిత్రాలు తీసిన కె.వి.రెడ్డి అంటే మహేశ్ కి చాలా ఇష్టం. రామనాథం బృందం ఏ ప్రదర్శన ఇచ్చినా కొన్నాళ్ళ పాటు మాకు అది చర్చనీయాంశంగా ఉండేది. ఆ నెపాన మేము ఎందరెందరి గురించో, భరతముని నుంచి బాదల్ సర్కార్ దాకా, గురజాడ అప్పారావు నుండి గరికపాటి రాజారావుదాకా ఎందరి గురించో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం.
 
ఆ రోజు ఆ నాటకాన్ని ప్రేక్షకుల మధ్యనుంచి చూసినప్పుడు రామనాథం ప్రేక్షకుల నాడిని పట్టుకోగలడని అర్థమయినప్పటికీ, అలా చూపించడం సముచితమేనా అనే ప్రశ్న నన్ను చాలాకాలం వెన్నాడింది. ఏళ్ళ తరువాత ఎప్పుడో నాట్యశాస్త్రం చదువుతున్నప్పుడు నాకు సమాధానం దొరికింది. భరతముని ‘నాట్యధర్మి ‘, ‘లోకధర్మి’ అనే రెండు భావనలు పరిచయం చేస్తాడు. ఆయన చెప్పినదాన్ని బట్టి లోకవ్యవహారంలో ఉన్నది ఉన్నట్టు చూపించడం లోకధర్మి. ఇప్పటి భాషలో చెప్పాలంటే realist practice అన్నమాట. కాని దాన్ని నాటకకళకు తగ్గట్టుగా మలుచుకుని చెప్పడం నాట్యధర్మి. ఆ మాటకొస్తే, అసలు ఏ నాటక ప్రదర్శన అయినా కూడా అన్నిటికన్నా ముందు నాట్యధర్మి కాక తప్పదు. అందుకనే నాట్యశాస్త్రం ‘నాట్యధర్మీ ప్రవృత్తం హి సదా నాట్యం ప్రయోజయేత్’ (నాట్యమెప్పుడూ నాట్యధర్మి సహితంగానే ప్రయుక్తం కావాలి.) (నా.శా, 14: 74) అన్నది!
 
21-1-2022 & 2-1-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading