తమిళ మిత్రుల స్పందన

జయమోహన్ ప్రసిద్ధ తమిళరచయిత, సాహిత్యవేత్త. నవల, కథ, సాహిత్యవిమర్శ, తాత్త్వికసమాలోచన, జీవితచరిత్ర వంటి వివిధ ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేసిన వ్యక్తి. గత పదేళ్ళుగా ఆయన మహాభారతాన్ని ‘వెన్ మురసు’ పేరిట ఒక నవలగా రాయడం మొదలుపెట్టి ఇటీవలే ముగించారు. 26000 పేజీల ఆ నవల 26 సంపుటాలుగా వెలువడింది. ప్రపంచ సాహిత్యంలోనే అంత సుదీర్ఘమైన నవల మరొకటిలేదు.
 
ఆయన 1997 లో ‘విష్ణుపురం’ అనే ఒక నవల రాసారు. చారిత్రిక నేపథ్యంతో రాసిన ఒక కాల్పనిక రచన అది. దాన్ని పాఠకలోకం విశేషంగా ఆదరించింది. ఆ పాఠకుల్లో కొందరు ‘విష్ణుపురం ఇలక్కియ వట్టం’ పేరిట ఒక సాహిత్యబృందంగా ఏర్పడ్డారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా పాఠకులు అందులో సభ్యులుగా చేరారు. 2011 నుండీ ఆ బృందం ఒక ప్రతి ఏటా ఒక తమిళ రచయితను ఎంపికచేసి అతడికి సాహిత్య పురస్కారం,సన్మానం చేస్తూ ఉన్నారు. సాహిత్య అకాదెమీ గాని, ఇతర సాహిత్య సంస్థలు గాని ఇంతదాకా గుర్తించని ప్రతిభావంతుడైన రచయితను ఎంపికచేసి అతడి సాహిత్యం మీద విస్తృతంగా చర్చించడం, ఏటా డిసెంబరు చివరివారంలో కోయంబత్తూరు లో రెండు రోజులు సాహిత్యగోష్టి నిర్వహించడం ఆ బృందం చేస్తున్న పని. దాంతో పాటు వారు తమ గోష్టికి ప్రతి ఏటా భారతీయభాషలనుంచి ఒక రచయితనో, కవినో ఆహ్వానించి,ఆ భాషా సాహిత్యం గురించి కూడా ఒక గంటపాటు ఆ రచయితతో ముఖాముఖి చర్చ చేపడుతూ ఉన్నారు. రెండవరోజు సాయంకాలం ప్రధాన సమావేశంలో తమ పురస్కారాన్ని పొందిన తమిళ రచయితకు ఆ సోదర భారతీయభాషా రచయితతో సన్మానం చేయిస్తూ ఉన్నారు.
 
ఈసారి ఆ పురస్కారానికి ప్రసిద్ధ తమిళ కవి విక్రమాదిత్యన్ ను ఎంపిక చేసారు. ఆ గోష్టిలోనూ, ఆ పురస్కార ప్రదానంలోనూ పాల్గొనడానికి తెలుగు సాహిత్యం నుంచి ఒక ప్రతినిధిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. వారికి ఒక మిత్రుడు నా పేరు సూచిస్తే, నన్ను సాదరంగా ఆహ్వానించేరు.
అయితే వారు ఇప్పటిదాకా నా పేరు వినలేదు. నా రచనలు చదవలేదు. కాబట్టి, నా కవితలు, రచనలు ఇంగ్లిషు అనువాదాలేమైనా ఉంటే పంపించమని అడిగారు. నా దగ్గర ఎప్పుడో సాహిత్య అకాడెమీ కోసం నేను చేసుకున్న నాలుగు కవితలు అనువాదాలు తప్ప మరేమీ లేవు. ఈలోగా నౌడూరి మూర్తిగారు ఇటీవలే వెలువరించిన Voices of the Surf పుస్తకం నా చేతికి అందింది. అందులో ఆయన నా కవితలకు చేసిన అనువాదాలు సుమారు పదిదాకా ఉన్నాయి. అది కాక ఇంతకుముందు సంపుటంలో ఆయన అనువదించిన మరొక కవిత కూడా ఉంది. మొత్తం పదిహేను కవితలు అనువాదాలు వారికి పంపించాను. వాటితో పాటు ఆ బృందానికి నన్ను పరిచయం చేసిన మిత్రుడు నేరుగా తెలుగు నుంచి తమిళంలోకి రెండు మూడు కవితలు నావి అనువదించి పంపాడు. నన్ను పరిచయం చేస్తూ జయమోహన్ కి ఒక ఉత్తరం కూడా రాసాడు. అందులో అతడు నన్ను తమిళంలో జ్ఞానకూత్తన్, దేవదచ్చన్, పిరమల్ వంటి కవుల కోవకు చెందిన కవిగా పరిచయం చేసాడు.వాటితో పాటు నా కవితల ఇంగ్లిషు అనువాదాల్ని శుభశ్రీ, సుచిత్ర మొదలైన కొందరు తమిళ మిత్రులు తమిళంలోకి అనువదించారు.
 
ఆ విధంగా ఆ మిత్రులు నా కవితలకు చేసిన పదిహేను అనువాదాల్ని జయమోహన్ తన బ్లాగులో వరసగా అయిదురోజుల పాటు తమిళ మిత్రులకి పరిచయం చేసారు. ఆ కవితలకు తమిళ మిత్రులనుండి ఊహించనంత స్పందన లభించింది. ఆ కవితలు తమకి కొత్త సౌందర్యశాస్త్రాన్ని పరిచయం చేస్తున్నాయని వారంతా కొనియాడారు. ఆ లేఖల్ని కూడా జయమోహన్ తన బ్లాగులో ప్రచురించారు.
 
ఆ లేఖల్లో ఆర్ మోహన కుమార్ అనే ఆయన ఇలా రాసాడు:
 
‘మనం చదువుతూ వస్తున్న కవిత్వం కన్నా చినవీరభద్రుడు కవిత్వం ఎంతో భిన్నమైందిగా కనిపిస్తున్నది… కవిత్వంలోని సంవేదనలు సరికొత్తగా కనిపిస్తున్నాయి..నాకు ఇన్నాళ్ళూ తెలుగు కవిత్వం గురించి ఉన్న అభిప్రాయాన్ని ఈ కవితలు మార్చేసాయి. అత్యంత ఆధునికమైన కవితలు ఇవి. రాజకీయాల ద్వారానూ, సినిమా ద్వారానూ తమిళం గురించి బయటి ప్రపంచం ఏర్పరచుకునే దురభిప్రాయం లాంటిదే తెలుగు పరిస్థితి కూడా అనుకుంటున్నాను. ఇదిగో, ఇటువంటి ఒక ఆధునిక కవి తన నవ్య కవిత్వంతో మన ముందు ప్రత్యక్షమయినప్పుడు మాత్రమే తెలుగుని ఇన్నాళ్ళూ మనమెంత అపార్థం చేసుకున్నామో తెలిసి వస్తున్నది.’
 
మరొక ఉత్తరంలో రవీంద్రన్ అనే ఆయన ‘చినవీరభద్రుడు రాసిన ఈ కవిత నన్ను ముగ్ధుణ్ణి చేసినట్టుగా ఇటీవలి కాలంలో మరే కవితా లేదు’ అని రాసాడు.
 
ఎస్. రామచంద్రన్ అనే ఆయన రాస్తూ ‘ఈ తెలుగు కవిత్వాన్ని నేను కొంత అనాసక్తితోనే చదవడం మొదలుపెట్టానని ఒప్పుకోక తప్పదు. కాని ఈ కవిత్వం నన్ను ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ కవితలది ఒక ప్రత్యేకసౌందర్యశాస్త్రం. పోయిన సారి కె.జి.శంకరపిళ్ళై, తర్వాత మళ్ళా ఈ కవిత్వం నాకొక సరికొత్త సౌందర్యాన్ని పరిచయం చేస్తున్నది ‘ అని రాసాడు.
 
మరొక పాఠకుడు ‘చినవీరభద్రుడి కవితలు నేను చాలా ఆసక్తితో చదువుతున్నాను. ఇస్మాయిల్ మీద రాసిన కవిత.. ఒక కవి గురించి చెప్పాలంటే ఇంతకన్నా అత్యుత్తమంగా మరోలా చెప్పలేం’ అని రాసాడు.
 
పరిమళం నన్ను గాయపరిచినప్పుడు అనే కవిత గురించి రాస్తూ ఎస్. అనే పాఠకుడు రాస్తున్నాడు కదా: ‘అసలు ఈ కవిత శీర్షికనే ఎంతో అందంగా ఉంది. ప్రేమ గురించి రాసిన అద్భుతమైన కవిత. కొన్ని పరిమళాలు మనల్ని రంపాల్లాగా కోసేస్తాయన్నది ప్రేమికులకి అనుభవమే. ..ఆ పరిమళం ఒక నదిజాడలాగా మిగిలిపోయిందని కవి అంటున్నప్పుడు నా గుండె బద్దలైపోయిందనిపించింది’ అని.
ఆ కవితల తమిళ అనువాదాల్నీ, ఆ ఉత్తరాల్నీ జయమోహన్ నాకు పంపించారు. ఆ కవితల్లో భాష, పదచిత్రాలూ చాలా కొత్తగా ఉన్నాయని ప్రశంసించారు. తమిళం తెలిసిన నా మిత్రులెవరైనా చదవడానికి వీలుగా వాటినిక్కడ పొందుపరుస్తున్నాను:
 
ఉత్తరాలు:
 
కవిత్వమంటే అనువాదంలో నష్టపోయేది అని రాబర్ట్ ఫ్రాస్ట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాని కవిత్వమంటే అనువాదాన్ని దాటి కూడా బతికేది అని, ఆక్టేవియో పాజ్ అనుకుంటాను, అన్నాడు. నా కవితలు ఇంగ్లిషునుంచి తమిళంలోకి వెళ్ళిన తరువాత కూడా ఆ రసజ్ఞుల్ని అంతగా అలరించగలగడం నాకు చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది.
 
2
 
మాకు కోయంబత్తూరు ఏర్ పోర్ట్ లో ఇద్దరు మిత్రులు స్వాగతం పలికారు. వారిద్దరూ విష్ణుపురం సాహిత్యబృందానికి చెందినవాళ్ళే. ఒకరు సెంథిల్, వ్యాపారవేత్త, మరొకరు రామ్ కుమార్, మేఘాలయ కాడర్ కి చెందిన ఐ.ఏ.ఎస్ అధికారి. మేము గెస్ట్ హవుస్ కి వెళ్ళగానే అక్కడ మమ్మల్ని జయమోహన్ ఒక పుష్పగుచ్ఛంతో స్వాగతించారు. ఆయనతో పాటు మరొక సాహిత్యమిత్రురాలు శుభశ్రీ కూడా ఉన్నారు.
 
జయమోహన్ వంటి సుప్రసిద్ధ సాహిత్యవేత్త, ఫిల్మ్ కళాకారుడు అంత రాత్రివేళ నాకోసం వేచి ఉండి నాకు స్వాగతం పలకడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన కేవలం మర్యాదపూర్వకంగా పలకరించి వెళ్ళిపోకుండా ఆ రాత్రి నాతో సాహిత్యగోష్ఠి మొదలుపెట్టారు. ఆ ఉత్సాహంలో నేనాయనకు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్ర మొత్తం చెప్పేసాను. నన్నయ నుండి ఇస్మాయిల్ దాకా తెలుగు కవులు తెలుగు భాషతో చేసిన ప్రయోగాల గురించి, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన ఉద్యమాల గురించి, ఉద్యమాలతో నిమిత్తంలేకుండా తమదైన దారిలో గొప్ప కవిత్వాన్ని వెలువరించిన కవుల గురించి కూడా చెప్పాను. ఆయన అంతా విని, ‘తెలుగు గురించి మాకేమీ తెలీదు. ఇంత కవిత్వం వచ్చిందని కూడా తెలియదు. ఒక రెండువందల కవితలతో ఒక సంకలనం కూర్చి మాకు ఇవ్వండి. నేను దాన్ని తమిళంలోకి అనువదింపచేసి ప్రచురింపచేస్తాను ‘ అన్నాడు.
 
జయమోహన్ అక్కడ కూర్చున్నంతసేపూ ఆయన వదనంలో ఒక నిర్మలత్వం, గొప్ప గురువుల దగ్గర మాత్రమే అనుభవానికొచ్చే ఒక తేటదనం కనిపిస్తూ ఉన్నాయి. టాల్ స్టాయి, గాంధీల ప్రభావం ఆయన రచనలమీద ఉందని విన్నానుగానీ, అంతకుమించింది మరొకటేదో ఉందనిపించింది. ఆ తర్వాత రాజు చెప్పాడు, ఆయన శ్రీనారాయణ గురు సంప్రదాయానికి చెందినవాడనీ, ఆ పరంపరకు చెందిన నిత్యచైతన్య యతి అనే ఆయన జయ మోహన్ ను శిష్యుడిగా స్వీకరించాడనీ.
 
ఆ మర్నాడు క్రిస్మస్. వారి సాహిత్యగోష్టిలో మొదటిరోజు. రెండవరోజు పొద్దున్నే నాతొ ఒక ముఖాముఖి ఏర్పాటు చేసామనీ, మొదటిరోజు ఎక్కడేనా చుట్టుపక్కల తిరగాలనుకుంటే తిరిగి రండి అని చెప్పారు. ఆ మర్నాడు అంటే 26 వ తేదీ ఉదయం తొమ్మిదిగంటలకల్లా సమావేశమందిరానికి చేరుకున్నాం. అక్కడే బ్రేక్ ఫాస్ట్ కూడా ఏర్పాటు చేసారు. అల్పాహారం ముగించుకుని తొమ్మిదిన్నరకల్లా మందిరంలోకి అడుగుపెట్టేటప్పటికి భారతియార్ పాట ఒకటి వినిపిస్తూ ఉంది.
విశాలమైన ఆ మందిరంలో అప్పటికే రెండుమూడువందల మంది మిత్రులు చేరి ఉన్నారు. వాళ్ళల్లో అత్యధికభాగం అంటే తొంభై శాతంకన్నా ఎక్కువమంది యువతీయువకులే ఉన్నారు.
 
ఆ రోజు మొదటి సెషన్ నాకు కేటాయించారు. ఒక మిత్రుడు తిరుప్పావై నుండి ఒక పాశురం వినిపించిన తర్వాత సభ మొదలయ్యింది. మిత్రుడు రాజు ఆ సభని నిర్వహించాడు. ఆయన నా గురించి స్థూలంగా పరిచయం చేస్తూ మొదటి ప్రశ్నగా ‘నిర్వికల్ప సంగీతం నుండి నీటిరంగుల చిత్రం కవితలకు వచ్చేటప్పటికి మీ కవిత్వ నిర్మాణంలో చాలా మార్పు వచ్చింది. ఇందుకు కారణాల్లో సంగం సాహిత్యం కూడా ఒకటని చెప్పారు. అది ఏ విధంగానో వివరిస్తారా’ అనడిగాడు. ఆ తరువాత అక్కడి శ్రోతల్లోంచి మరికొంతమంది మరికొన్ని ప్రశ్నలు అడిగారు. వారు నా కవిత్వాన్ని చదవడమే కాక, ప్రతి ఒక్క కవితనీ లోతుగా మననం చేసుకుని మరీ ఆ సమావేశానికి వచ్చారని అర్థమయింది. ఒకాయన నా కవిత నుంచి అయిదారు పంక్తులు అక్కడే తెలుగులోనే అప్పగించేసాడు కూడా. కాని నా కవిత్వం మీద చర్చగా మొదలయింది కాస్తా తెలుగు సాహిత్యం మీదా, సమకాలిక తెలుగు, తమిళ సాహిత్యాల మీదా చర్చగా మారిపోయింది. కేటాయించిన గంట సమయం దాటి గంటన్నరదాకా మిత్రులు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నేను ఇంగ్లిషులో ఇస్తున్న జవాబుల్లో మరీ కీలకమైన వాక్యాల్ని నా మిత్రుడు రాజు, కొన్ని సార్లు జయమోహన్ తిరిగి అక్కడి శ్రోతలకోసం తమిళంలోకి తర్జుమా చేసి చెప్తూ ఉన్నారు.
 
నా సెషన్ తర్వాత వసంత్ సాయి అనే ఒక ప్రసిద్ధ ఫిల్మ్ దర్శకుడితోనూ, ఆ తర్వాత విష్ణుపురం పురస్కారం అందుకోబోతున్న కవి విక్రమాదిత్యన్ తోనూ ఇష్టాగోష్టి నడిచింది. ఆ తర్వాత చక్కటి తమిళ విందు.
 
మధ్యాహ్నం కూడా సెషన్లు నడిచాయి కాని నేను హజరు కాలేదు. సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ సుప్రసిద్ధ రచన The Light of Asia మీద ఇటీవల జయరాం రమేష్ ఒక పుస్తకం వెలువరించారు. ఒక సెషన్ ఆయనతో ఆ పుస్తకం మీద గోష్టి నడిచింది.
 
సాయంకాలం ప్రధాన సమావేశం. పురస్కార ప్రదానం. సుమారు మూడు నాలుగువందల మంది సాహిత్యాభిమానులు ఆ వేడుకలో పాలుపంచుకున్నారు. అతిథులందరితోటీ ఆ కవిని సత్కారం అందించారు. ప్రతి ఒక్క అతిథికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ తమిళ అభిమానం చూసిన తర్వాత, నాకు అక్కడ తెలుగులో మాట్లాడాలనిపించింది. నా ప్రసంగాన్ని మిత్రుడు రాజు తమిళంలోకి అనువదించాడు. నేను రెండేళ్ళ కిందట, ఎన్నికల పరిశీలకుడిగా విల్లుపురం వచ్చినప్పుడు పూర్వ తమిళమహాకవులు నడయాడిన ప్రదేశాలు చాలా తిరిగి చూసాననీ, వారి కవిత్వాన్ని ఎంతో ఇష్టంగా చదువుకున్నాననీ, ఆ నా పర్యటనల్ని ‘పాటలు పుట్టిన తావులు ‘ పేరిట పుస్తకంగా వెలువరించాననీ, ఆ కవులంతా అందుకు సంతోషించి నన్ను ఆశీర్వదిస్తూ, ఈ సమావేశానికి ఆహ్వానించినట్టుగా భావిస్తున్నానని చెప్పాను.
 
(ఆ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు. https://www.youtube.com/watch?v=16ka8O8Yeag)
 
సమావేశం ముగిసిన తర్వాత కూడా చాలాసేపటిదాకా అక్కడి మిత్రులు ఒకరొకరే వచ్చి పలకరిస్తూ నాతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు పొద్దుటి గోష్టి గురించి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషపూర్వకంగానూ, ప్రశంసాపూర్వకంగానూ మాట్లాడేరు. ‘వాళ్ళు మొదట్లో మర్యాదకోసం అట్లా చెప్తున్నారనుకున్నాను. కాని లేదు, చాలామంది నాతో మళ్ళా మళ్ళా చెప్తూనే ఉన్నారు. పొద్దుటి మీ ప్రసంగం వల్ల వాళ్ళకి తెలుగు సాహిత్యద్వారాలు తెరుచుకున్నట్లు అనిపిస్తున్నదని చెప్తున్నారు’ అన్నాడు నా మిత్రుడు. ‘మిమ్మల్ని వాళ్ళు ఒక మాష్టర్ అని అంటున్నారు’ అని కూడా అన్నాడు.
 
జయమోహన్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు కూడా ఆయన పొద్దుటి గోష్టి గురించి ఎంతో ప్రశంసతో మాట్లాడేరు. ‘ఆధునిక తెలుగు కవిత్వం నుంచి రెండు వందల కవితలు, మర్చిపోకండి’ అన్నారు మరోసారి.
 
27-12-2021 & 28-12-2021
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading