మళ్ళా గిరిజన సంక్షేమం. అరవై వేల పాఠశాలలు, మూడు లక్షల మంది ఉపాధ్యాయులు, డెబ్భై లక్షల మంది విద్యార్థులు ఉండే పాఠశాల విద్యాశాఖనుండి గిరిజన సంక్షేమ శాఖకి రాగానే పెద్ద సముద్రం దగ్గరనుండి చిన్న కొండవాగు దగ్గరకు చేరినట్టుంది. కాని ఇది నా సొంత దేశం, నా సొంత ఊరు, సొంత ఇల్లు.
నిన్న తెనాలి వెళ్ళాను. అక్కడ ఒకప్పటి గిరిజన బాలికల హాస్టల్ని వెతుక్కుంటూ. ఇప్పుడక్కడ గురుకుల పాఠశాల నడుస్తున్నది. హాస్టళ్ళను గురుకుల పాఠశాలలుగా మార్చాలన్న ఆలోచనలో ఒకప్పుడు మేము చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సఫలమై కనబడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది.
నిన్న మధ్యాహ్నం పిల్లల్తో కలిసి భోజనం చేస్తున్నంతసేపూ ఈ పాఠశాలల్ని మరొక మెట్టు పైకి తీసుకువెళ్ళడానికి ఏమి చెయ్యవచ్చునా అనే ఆలోచిస్తూ ఉన్నాను.
5-12-2021