కబీరు ‘నాది దుఃఖం లేని దేశం’ ఇప్పుడే సాయిచరణాలదగ్గర సమర్పించి వచ్చాను.
తన మతం కబీరని విస్పష్టంగా చెప్పినవాడు. నిజమైన సూఫీ. అవధూత. ఆయన పాదాలదగ్గర ఆ పుస్తకం ఆవిష్కరణ కావటం నా భాగ్యం. ఈ పుస్తకం మా హీరాలాల్ మాష్టారికి అంకితమిచ్చాను.
పుస్తకం నుంచి ఒక కవిత:
ఓ ఫకీరూ, నువ్వు నా మనసుని పట్టుకున్నావు
ఓ ఫకీరూ నువ్వు నా మనసుని పట్టుకున్నావు.
నేను నా మందిరంలో నిద్రపోతూండగా నువ్వు నీ సంగీతంతో నన్ను తట్టిలేపావు.
ఈ భవసాగరంలో మునిగిపోతూండగా, నా బాహువులు పట్టుకుని పైకి లేపావు.
ఒకే ఒక్క మాట. మరోమాటతో పనిలేదు. నువ్వు నా బంధాలన్నిట్నీ తుంచేసావు.
సోదరులారా, సాధువులారా, వినండి. ఆ ఫకీరు ఒక బిగికౌగిలింతతో నా హృదయాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు.
24-12-2017