కవీశ్వరుడు వెళ్ళిపోయి

Reading Time: < 1 minute

301

కవీశ్వరుడు వెళ్ళిపోయి 366 రోజులు.

మళ్ళీ మామిడికొమ్మలు పూసాయి. కానుగచెట్లు చిగురించాయి, వేపచెట్లు విప్పారాయి.

ఏడాది కిందట ఆకాశంలో సూర్యుడెక్కడున్నాడో మళ్ళా అక్కడికే వచ్చినిలబడ్డాడు.

కాని ఆ గంభీరస్వరం, ఆ పద్యం, ‘దొరవారూ’ అంటూ పిలిచే ఆ పిలుపు మాత్రం మళ్ళీ వినబడలేదు, వినబడదన్న ఊహనే తట్టుకోవడం ఏడాది కింద ఎంతో కష్టంగా ఉండింది.

కాని, ఆ ఊహ, ఆ లోటు అట్లా ఉంటూండగానే, కాలం ఎప్పట్లానే మామూలుగా గడిచిపోయింది, అదే ఆశ్చర్యం.

బహుశా అదే మన జీవితాల్లో గొప్ప విషాదం కూడా.

2

కొత్త పుస్తకం ఆఫీసుకి తీసుకువెళ్ళినప్పుడల్లా పువ్వు వాసన పసిగట్టిన తుమ్మెదలాగా వచ్చివాలేవాడు.

ఈ ‘మచాడో’, ఈ ‘ట్రాన్స్ ట్రోమర్’, ఈ ‘ రూమీ’, చివరగా, మేము కలిసి మాట్లాడుకున్న చివరిరోజు- ఈ ‘మిళింద ప్రశ్న’ ఒక్కసారి తీసుకువెళ్ళనా అనేవాడు,

ఆ కవిత్వం చదవడానికి మాత్రమేనా? కాదు, ఆ పుస్తకాల్లోంచి నా మనోప్రపంచంలోకి ఎగబాకాలని చూసేవాడు.

బహుశా, కవీశ్వరా, ఈ రోజు నీ గురించి తలుచుకుంటున్నప్పుడు టాగోర్ రాసుకున్న ఈ పద్యం గుర్తొస్తోంది:

Those who are near me do not know that you are nearer to me than they are

Those who speak to me do not know that my heart is full with your unspoken words

Those who crowd in my path do not know that I am walking alone with you

They who love me do not know that their love brings you to my heart.

3

ఇంతకీ, కవితాప్రసాద్ లేకపోతే నన్ను పలకరించే ఒక మిత్రుడు లేకపోయినట్టు మాత్రమేనా?

కాదు, ఆ రోజు అందరితో చెప్పిన మాటనే ఇప్పుడూ మళ్ళా అంతే నమ్మకంతో మరోసారి చెప్పుకుంటున్నాను.

కవితాప్రసాద్ లేకపోయినందుకు ఎక్కువ నష్టపోయింది తెలుగు భాష, తెలుగు పద్యం, తెలుగు సంస్కృతి.

14-3-2016

Leave a Reply

%d bloggers like this: