నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు

64

మీకు నచ్చిన అయిదు పుస్తకాల పేర్లు చెప్పండి అని అడిగాడో మిత్రుడు. ‘నచ్చినవా? మెచ్చినవా? తెలుగులోనా? ప్రపంచ సాహిత్యంలోనా’ అనడిగాను.

‘ప్రపంచసాహిత్యంలోంచే చెప్పండి’ అన్నాడు.

ఆలోచించాను, ఒక రోజంతా. నచ్చినవీ, మెచ్చినవీ చాలానే ఉన్నాయి. ఎంచడం కష్టమే కాని, ఏదోలా ఎంచి చూపించవచ్చు.

కాని, ఆ ప్రశ్న నేను మరోలా వేసుకున్నాను. నిన్ను ప్రభావితం చేసిన పుస్తకాలేవి? నీ జీవితాన్ని మార్చిన పుస్తకాలు? ఏ పుస్తకాలు చదవకపోయి ఉంటే నీ జీవితం మరోలా ఉండేదో, కనీసం ఇప్పట్లాగా ఉండేది కాదో ఆ పుస్తకాలు. ఏ పుస్తకాలు నీ వ్యక్తిత్వపు మూలధాతువులో భాగమైపోయాయో, ఆ పుస్తకాలు.

అసలు మనిషి ఏదన్నా చదివో, వినో, ఎవరినయినా చూసో ప్రభావితమయ్యేది ఎప్పుడు? చిన్నప్పుడు అని చెప్పవచ్చు. ఎంతదాకా? బహుశా ఇరవయ్యేళ్ళ వయసు వచ్చేదాకా. నేను మరొక అయిదేళ్ళు కలుపుకున్నాను. నా పదేళ్ళ వయసునుంచి పాతికేళ్ళ వయసు దాకా చదివినవాటిలో నన్ను అప్పటికప్పుడు ఉద్వేగపరిచినా ఆ తర్వాత వాటివైపు మళ్ళా చూడాలనిపించని పుస్తకాలు పక్కన పెట్టేసాను. నా జీవితాన్ని తొలిరోజుల్లో మలుపు తిప్పిన రెండు మూడు పుస్తకాలున్నాయి. వాటిని మళ్ళా చదవలేదు. కాని, వాటిని చదవకపోయుంటే, నా జీవితమిట్లా ఉండేది కాదని చెప్పగలను. ఇక మరికొన్ని పుస్తకాలు నా జీవితసారాంశాన్ని రూపొందించాయి,నా రక్తంలో కలిసిపోయాయి. వాటిని జీవితం పొడుగునా మళ్ళీ మళ్ళీ చదువుకోవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ పుస్తకాల వల్ల నాకు విస్తృత ప్రపంచ సాహిత్యంలోకి, ఆధ్యాత్మిక వాజ్మయంలోకి తలుపులు తెరుచుకున్నాయి. కాబట్టి, వాటిని నేను నా పారాయణగ్రంథాలుగా లెక్కించుకున్నాను.

రెండు వారాలుగా నన్ను నేను శోధించుకున్నాక, అన్ని వడపోతల తర్వాత నేను ఎంచుకున్న పుస్తకాలివీ:

శ్రీ మహాభక్తవిజయము

నా చిన్నప్పుడు,అంటే పదేళ్ళ వయసుకన్నా ముందే, మా ఇంట్లోనూ, రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీలోనూ నాకు దొరికిన పుస్తకాలన్నిటిలోనూ నన్ను గాఢంగా ఆకట్టుకున్న పుస్తకం శ్రీ మహాభక్తవిజయము. ఆ పుస్తకాన్ని కొన్ని వందలసార్లేనా చదివి ఉంటాను. తర్వాత రోజుల్లో ఆ పుస్తకాన్ని రెండు భాగాలుగా మా నాన్నగారు బైండు చేయించారు. ఆ పుస్తకం ముందు పుటలు పోవడంతో నాకు కొద్దిగా సాహిత్య జ్ఞానం వచ్చేటప్పటికి ఆ రచయిత ఎవ్వరో తెలియకుండా పోయింది. చాలా కాలం పాటు అది మహీపతి రాసిన భక్తవిజయానికి అనువాదమేమో అనుకున్నాను. కాదని తెలిసింది. ఎన్నాళ్ళుగానో నన్ను వేధిస్తున్న ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో నని, ఈ మధ్య నెట్ లో బ్రౌజు చేస్తే, ఆశ్చర్యం, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో ఆ పుస్తకం కనిపించింది. ఆ రచయిత పేరు చూస్తే ఆశ్చర్యానందాలు ముంచెత్తాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి! వావిళ్ళవారి ప్రచురణ (1952). ఆ పుస్తకం నాలో ఇంకిపోయిందని చెప్పవచ్చు. నా తదనంతర జీవితమంతా ఆ భక్త కవుల్ని ఒక్కొక్కరినీ వెతుక్కుంటూ ఉండటమేనని ఇప్పుడు తెలుస్తోంది నాకు.

ఉపనిషత్తులు

నేను డిగ్రీ మొదటిసంవత్సరంలో ఉండగా, గాంధీజీ ఈశోపనిషత్తు మీద రాసిన కొన్ని వాక్యాలు చదివాను. ఆ వాక్యాలు కలిగించిన ప్రేరణతో నేను రాజమండ్రిలోఉండగా, దశోపనిషత్తులురామకృష్ణమఠం వారి తెలుగు అనువాదాలు చదివాను. ఈశ, కఠ, తైత్తిరీయ ఉపనిషత్తులు నన్ను వెంటనే ఆకట్టుకున్న ఉపనిషత్తులు. ఆ తర్వాత రోజుల్లో ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు మరింత వివరంగా చదువుకున్నాను. మాండూక్య, ముండక, కేన, ఐతరేయ, ప్రశ్నోపనిషత్తులు ఆ తర్వాత చదివాను. కాని ఉపనిషత్తుల్ని ఒకసారో లేదా పదిసార్లో చదివి చదివాం అని చెప్పేవి కావు. అవి జీవితకాలం అధ్యయనం చెయ్యవలసిన పాఠాలు.

సువార్తలు

నా చిన్నప్పుడు తాడికొండ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా స్కూల్లో ఎవరికో సువార్తలు పోస్టులో వచ్చాయి. ఆ పుస్తకాల్ని చిలకలూరిపేట నుంచి ఎస్.జాన్ డేవిడ్అనే ఆయన ఉచితంగా పంపుతున్నాడని తెలిసాక, పిల్లలం అందరం ఆ పుస్తకాలు తెప్పించుకున్నాం. అందమైన రంగుల ముఖచిత్రాలతో ఆ పుస్తకాలు మమ్మల్ని చాలా సమ్మోహపరిచేవి. తర్వాత రోజుల్లో పాతనిబంధన, సామగీతాలు, సొలోమోన్ గీతంతో పాటు చదివినప్పటికీ, జెరిమియా, యోబు, ఇషయ్యా, డానియేలు, జోనా వంటి ప్రవక్తల వేదన హృదయానికి సన్నిహితమయినప్పటికీ, సువార్తల వెలుగు మాత్రం అద్వితీయమైంది అని చెప్పగలను. కాలం గడిచేక అగస్టయిన్, ఎక్కార్ట్, టాల్ స్టాయి వంటి వారిమీద సువార్తలు చూపించిన ప్రభావం గురించి తెలుసుకుంటున్న కొద్దీ, సువార్తలు పసితనంలోనే నా హృదయం మీద వదిలిపెట్టిన గాఢముద్ర తక్కువేమీకాదని అర్థం చేసుకున్నాను. మొదట్లో యోహాను సువార్త అన్నిటికన్నా గొప్పదని అనుకునేవాణ్ణి కాని, బైబిల్ పరిజ్ఞానం మరింత అందుబాటులోకి వస్తున్నకొద్దీ, నాలుగు సువార్తల్లో ప్రతి ఒక్కటీ దానికదే అద్వితీయమైందని బోధపడుతూ ఉంది.

సురా అల్ ఫాతిహా

మా తాడికొండ గురుకుల పాఠశాలలో ఒక సంప్రదాయం ఉండేది. నరసింగరావుగారనే గొప్ప ఉపాధ్యాయుడు ప్రారంభించిన సంప్రదాయం అది. రోజూ సాయంకాలం ఆరుగంటలకి ప్రార్థనాసమావేశం ఉండేది. ఆ సమావేశంలో పిల్లలందరం హిందూ, క్రైస్తవ, మహ్మదీయ ప్రార్థనలు చేసేవాళ్ళం. మా స్కూల్లో ఒకే ఒక్క మహ్మదీయ బాలుడు ఉండేవాడు. అతడు మాత్రమే ఆ ప్రార్థన చేస్తూ ఉంటే మేమంతా అతడి వెనకనే ఆ ప్రార్థన అప్పచెప్పేవాళ్ళం. కాని ఒకసారి సెలవుల తర్వాత, ఆ పిల్లవాడు తిరిగి పాఠశాలకు వచ్చాక ఆ ప్రార్థన చెయ్యడానికి నిరాకరించాడు. తన తండ్రి అట్లా చెయ్యొద్దని చెప్పాడన్నాడు. కాని మా ఉపాధ్యాయుడికి ఆ ప్రార్థన లేకుండా ఆ సమావేశాలు నడపడం ఇష్టం లేకపోయింది. అతడి బదులు మరెవరైనా ఆ ప్రార్థన చెయ్యగలరా అనడిగాడు. అప్పటికెన్నో రోజులుగా ఆ ప్రార్థన చేసి చేసి ఆ వాక్యాలు నాకు కంఠతా వచ్చేసాయి. నేను లేచి నిల్చున్నాను. ఆ తర్వాత ఆ పాఠశాల నుంచి వచ్చేసాదాకా, మూడునాలుగేళ్ళ పాటు ప్రతి సాయంకాలం ఆ ప్రార్థన నేనే చేస్తూండేవాణ్ణి. కేవలం పదాలు పలకడమే కాని, అర్థం తెలియని ఆ ప్రార్థన, దివ్య ఖొరాను లోని మొదటి సూక్తమనీ, సురా అల్ ఫాతిహా అని నాకు తెలిసిన రోజున నాకు కలిగిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఆ దివ్యప్రార్థనకి మౌలనా అబుల్ కలాం ఆజాద్ తర్జుమన్ ఉల్ ఖురాన్ పేరిట వ్యాఖ్యానం రాసారని తెలిసినప్పుడు, ఆ పుస్తకం వెతికి పట్టుకుని మరీ చదివాను. ఆ వ్యాఖ్యానం చదువుతుంటే, అది ఈశోపనిషత్తు మీద శంకరాచార్యుల భాష్యంలానే అనిపించింది. తర్వాత రోజుల్లో రూమీ, తబ్రీజీల దివ్యపారవశ్యం నన్ను ఆకట్టుకోవడానికి ఆ ప్రార్థన ఆ పసితనంలో నా రక్తంలో ఇంకిపోయినందువల్లనే అని నిస్సంకోచంగా చెప్పగలను.

గౌతమబుద్ధుడు

నేను డిగ్రీ రెండవసంవత్సరంలో ఉండగా, కాకినాడ కేంద్ర గ్రంథాలయంలో ‘గౌతమ బుద్ధుడు’ అనే పుస్తకం చూసాను. దామోదర ధర్మానంద కోశాంబి రాసిన పుస్తకానికి పుట్టపర్తి నారాయణాచార్యుల అనువాదం. ఆ పుస్తకం చదివిన తర్వాత బుద్దుడు నాకెంతో సన్నిహితంగానూ, అత్యంత మానవీయంగానూ తోచాడు. బౌద్ధసాహిత్యం చదవాలన్న గాఢమైన ఉత్సాహం రేకెత్తింది. అందుకని, తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేయాలనుకున్నప్పుడు, రెండవ సంవత్సరం రెండు స్పెషల్ పేపర్లు రాయవలసి ఉంటే, అందులో ఒకటి బౌద్ధదర్శనం ఎంచుకున్నాను. తర్వాతి రోజుల్లో బుద్ధుడి దీర్ఘ, మధ్యమ సంభాషణలు, దమ్మపదం, జాతకకథలు, థేరీగాథలు, వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్రం, సద్ధర్మపుండరీక సూత్రం, బుద్ధ చరిత్ర, మిళింద ప్రశ్న వంటివి చదివినప్పుడు, నా పక్కన ఒకరు నిల్చుని దీపం ఎత్తిపట్టుకున్నట్టుగా అనిపించేదంటే, అది కోశాంబి-పుట్టపర్తి రచననే.

బనగర్ వాడి

మా తాడికొండ స్కూలు పెట్టిన చోట అంతకు ముందు బేసిక్ ట్రయినింగ్ స్కూలు నడిచేది. బేసిక్ ట్రయినింగ్ స్కూలంటే, గాంధేయ విద్యావిధానానికి అనుగుణంగా నడిచే పాఠశాల అన్నమాట. ఆ స్కూలుకి నుంచి మా స్కూలుకి భవనాలతో పాటు మంచి లైబ్రరీ కూడా దక్కింది. అందులో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన మేలిమి గ్రంథాలు కూడా మాకు లభించాయి. వాటిలో బనగర్ వాడి కూడా ఒకటి. వ్యంకటేశ మాడ్గూళ్కర్ అనే మరాఠీ రచయిత రాసిన పుస్తకం అది. తర్వాత రోజుల్లో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది. ఒక నిరక్షరాస్య కుగ్రామంలో పిల్లల్ని అక్షరాస్యుల్ని చెయ్యడంకోసం ఒక ఉపాధ్యాయుడి ప్రయత్నాలకీ, పోరాటానికి సంబంధించిన కథ అది. అది నాకు తెలియకుండానే నన్ను తీవ్రాతితీవ్రంగా ప్రభావితం చేసింది. ఎంత ప్రభావితం చేసిందంటే, నాకు పదవతరగతిలో రాష్ట్రంలో పదవ రాంకు వచ్చినప్పటికీ, లెక్కలు, సైన్సు గ్రూపుల్లో ప్రవేశం ఉచితంగా ఇస్తామన్నప్పటికీ, కావాలని సియిసి లో చేరాను. ఇంజనీరింగ్, మెడిసిన్ కాక సాంఘికశాస్త్రాలు చదువుకోవాలనీ, గ్రామాలకు పోయి, పేదప్రజల కోసం పనిచెయ్యాలనీ కోరుకున్నానంటే అందుకు కారణం బనగర్ వాడి అని స్పష్టం గా చెప్పగలను.

గాంధీజీ అడుగుజాడల్లో

జార్జి కాట్లిన్ ఒక పాత్రికేయుడు, జిజ్ఞాసి. రెండవప్రపంచ యుద్ధకాలంలో ప్రపంచంలో శాంతినిచ్చే తావు ఎక్కడుందా అని వెతుక్కుంటూ మహాత్ముడి అడుగుజాడల్ని అన్వేషించాడు. ఆ ప్రయాణం కొంత ఆధ్యాత్మికం, కొంత సాంస్కృతికం. ఆ అన్వేషణని పుస్తకంగా రాసాడు. ‘గాంధీజీ అడుగుజాడల్లో’ (1952) పేరిట తెలుగులో వచ్చిన ఆ అనువాదం మా అక్కకి స్కూల్లో బహుమతిగా ఇచ్చారు. నేను డిగ్రీ చదువుతుండగా ఒకసారి ఆ పుస్తకం తెరిచాను. అందులో ఆ రచయిత ప్రాచ్య, పాశ్చాత్య తాత్త్వికధోరణుల్నీ, కళల్నీ,సంస్కృతుల్నీ పోల్చుకుంటూ, సమన్వయపరుచుకుంటూ రాసిందంతా నన్నెంతో ఆకర్షించింది. అందుకని తత్త్వశాస్త్రం చదువుకోవాలని చాలా గాఢంగా కోరుకున్నాను. అదంతా నా ‘సత్యాన్వేషణ’ (2003) కు రాసుకున్న ముందుమాటలో వివరంగా చెప్పాను. ‘గాంధీజీ అడుగు జాడల్లో’ పుస్తకం మళ్ళా నెట్ లో దొరికింది గానీ, మళ్ళీ చదవాలనిపించలేదు. ‘బనగర్ వాడి’ లానే ఆ పుస్తకం కూడా జీవితపు తొలిదశలో నాకో దారిచూపించిన పెద్దమనిషిలాంటిది,అక్కడితో వాటి పాత్ర పూర్తయిపోయింది. కాని, ఆ పుస్తకం వల్ల తత్త్వశాస్త్రం పట్లా, గాంధీజీ పట్లా కలిగిన నా జిజ్ఞాస మాత్రం చల్లారనే లేదు.

ఫ్యూయర్ బా మీద సూత్రీకరణలు

మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనలు గుట్టలు పోసి అమ్మే రోజుల్లో కమ్యూనిస్టు ప్రణాళిక ఒక యాభై పైసలు పెట్టి కొని చదివాను. ఆ రచన చదివి ఉత్తేజానికి లోనుకాకుండా ఉండేవాడెవడుంటాడు? కాని, ఎనభైల మొదట్లో తెలుగుసాహిత్యంలో మార్క్సిజం మీద విస్తారంగా చర్చలు జరుగుతున్నందువల్లా, నా రాజమండ్రి మిత్రులు గోపీచంద్, మహేష్, సావిత్రిగారు వంటివారు మార్క్స్ గురించి తరచూ మాట్లాడుకుంటున్నందువల్లా, నేను మరింత లోతుగా మార్క్సిజాన్ని అధ్యయనం చెయ్యాలనుకున్నాను. అందుకని ఎమ్మేలో డయలెక్టికల్ మెటీరియలిజం ఒక స్పెషల్ పేపర్ గా తీసుకున్నాను. మార్క్స్, ఎంగెల్స్ ల కొన్ని ముఖ్యమైన రచనలతో పాటు, లెనిన్ ‘మెటీరియలిజం అండ్ ఎంపిరికో క్రిటిసిజం’ కూడా చదువుకున్నాను. కాని, నాకు అర్థమయిందేమంటే, ఎంగెల్స్, లెనిన్ ల కన్నా మార్క్స్ మరింత ప్రత్యేకమైన రచయిత అని. అతడు ప్రధానంగా కవి. పాతనిబంధనలోని ఇషయ్యా లాంటి భావుకుడు. అతడు ఆర్థిక, సామాజిక, రాజికీయ చింతకుడికన్నా ముందు తాత్త్వికుడు. కాంట్, హెగెల్, ఫ్యూయర్ బా ల జర్మన్ తత్త్వశాస్త్రపు పాదులో వికసించినవాడు. మార్క్స్ ఆలోచన అర్థం కావాలంటే, కాంట్ కన్నా ముందు ఐరోపీయ సత్యమీమాంస ఎటువంటి సమస్యకు లోనైందో తెలియాలి. దాన్ని కాంట్ ఏ విధంగా పరిష్కరించడానికి ప్రయత్నించాడో, ఆ పరిష్కారాన్ని ఫిక్టే, హెగెల్ ఏ విధంగా ఒక గతితార్కిక భావవాదంగా మార్చారో, ఆ భావవాదం నుంచి ఆ ఆలోచనని ఫ్యూయర్ బా ఏ విధంగా నేలమీదకు దింపడానికి ప్రయత్నించాడో తెలిస్తే, అప్పుడు మార్క్స్ దాన్ని గతితార్కిక భౌతికవాదంగా ఎట్లా ప్రతిపాదించాడో అర్థమవుతుంది. తనకి కలిగిన ఈ దార్శనిక స్పష్టతని దృష్టిలో పెట్టుకుని మార్క్స్ ‘జర్మన్ ఐడియాలజి’ అనే పుస్తకం రాస్తూ దానికోసం ఫ్యూయర్ బా మీద కొన్ని సూత్రీకరణలు చేసుకున్నాడు (1845). ఆ రచన ఆయన జీవితకాలంలో అచ్చుకాలేదు. ఎంగెల్స్ ఆ సూత్రీకరణల్ని కొద్దిగా సవరించి తన పుస్తకానికి అనుబంధంగా వేసుకున్నాడు. నాకు తెలిసి తెలుగులో వచ్చిన మార్క్సిస్టులు ప్రధానంగా ఎంగెల్సిస్టులూ, లెనినిస్టులూను. ఫ్యూయర్ బా మీద సూత్రీకరణల గురించి వాళ్ళెక్కడా మాట్లాడినట్టు కనిపించదు (ప్రసిద్ధమైన 11 వ సూత్రీకరణను పదేపదే వల్లెవేయడం తప్ప). ఆ సూత్రీకరణల్ని ‘పొలిటికల్ అండ్ ఎకనామిక్ మాన్యుస్క్రిప్ట్స్’ (1844) తో కలిపి చదివితే మార్క్స్ మాట్లాడిన గతితార్కిక భౌతికవాదం యాంత్రిక భౌతికవాదం కాదనీ, సృజనాత్మక భౌతికవాదమనీ అర్థమవుతుంది. ముఖ్యంగా, అందులో ఆయన ప్రతిపాదించిన పదవ సూత్రీకరణ The standpoint of the old materialism is civil society; the standpoint of the new is human society, or associated humanity అనేది నాకు సదా స్ఫూర్తిదాయక వాక్యం.

గీతాంజలి, చలం అనువాదం

తర్వాత రోజుల్లో ఇంగ్లీషులో రవీంద్రుడి అనువాదం,విలియం రాడిస్ అనువాదం కూడా చదివాను గాని, చలం అనువాదంలో చదివిన గీతాంజలి మాత్రమే నా దృష్టిలో గీతాంజలి. అది రవీంద్రుణ్ణీ, చలాన్నీ కూడా నాకు అందించింది. ఆ అనువాదమంటే, చలం రాసుకున్న ముందుమాట, సంజీవదేవ్ అనుమేళన కలుపుకుని కూడా. గీతాంజలి చదివేకనే నాకు కవిత్వం రాయాలనిపించింది. గీతాంజలి వల్ల నాకు ఉపనిషత్తులు మొదలుకుని భారతీయ భక్తి కవులందరి సారాంశమూ హృదయానికి చేరువకావడమేకాక, ప్రాచ్య, పాశ్చాత్య, ప్రాచీన, ఆధునిక ప్రపంచాల సన్మిలనం గోచరమైంది. ఈశ్వరుణ్ణి ఒక మూర్తిగా మాత్రమే కాక, ఒక మెలకువగా గ్రహించడమెట్లానో బోధపడింది. సగుణ, నిర్గుణ, ద్వైత, అద్వైత, హిందూ, క్రైస్తవ, పారశీక, మహ్మదీయ తత్త్వాలన్నీ ప్రవహించేది ఒకే సాన్నిధ్యం వైపు అని గ్రహించగలిగాను. కబీరు చెప్పినట్లుగా ఇంట్లోనే విముక్తినీ, బంధనాల్లోనే స్వాతంత్ర్యాన్నీ కనుగొనడమెట్లానో తెలుసుకున్నాను.

మహాప్రస్థానం

నా హైస్కూలు రోజుల్లో ఎట్లా వచ్చిందో మహాప్రస్థానం నా చేతుల్లోకి వచ్చింది. ఆ పుస్తకం చదివి మా స్కూల్లో పొద్దుటి అసెంబ్లీలో అయిదు నిమిషాలు మాట్లాడినప్పటినుంచీ, ఇప్పటిదాకా కూడా ఆ కావ్యం (చెలం యోగ్యతాపత్రంతో సహా) నా సాహిత్యజీవితంలో సింహభాగాన్ని ఆక్రమించేవుంది. ఆ పుస్తకం మొత్తం అప్పచెప్పగలిగే రోజులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పటికీ చాలా కవితలు తడుముకోకుండా అప్పచెప్పగలను. నేను పెళ్ళి పీటల మీద కూచుని ఉండగా, వేదమంత్రాలతో పాటు, మా సోమయాజులు ‘కవితా ఓ కవితా’ పూర్తి గీతం ఉద్వేగభరితంగా చదివిన క్షణాలు మరవలేను. చాలామంది తెలుగువాళ్ళకి మల్లే నాక్కూడా శ్రీ శ్రీ వల్లనే విశాల ప్రపంచానికీ, ఆధునిక ప్రపంచానికీ తలుపులు తెరుచుకున్నాయి. ప్రపంచం బాధ మనబాధ కావడమే నిజమైన జీవితాదర్శమని అతడి కవిత్వమే మనకెంతో సన్నిహితంగానూ, కన్వీన్సింగ్ గానూ చెప్తూవచ్చింది. వాల్మీకినుంచి ఇస్మాయిల్ దాకా కవిత్వాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నానంటే, నా మొదటి పారాయణ గ్రంథం మహాప్రస్థానం కావడమే అందుకు కారణం.

ఆగమగీతి

మామూలుగా యువకులు తమ యవ్వనకాలంలో గొప్ప ఉత్సాహంతోనూ, నవశక్తుల విజృంభణలోనూ ఉంటారు. కాని, నా యవ్వనకాలం చాలా సంక్షుభితమైన, అగమ్యమైన కాలం. అట్లాంటికాలంలో తల్లిలాగా, తండ్రిలాగా, స్నేహితుడిలాగా, గురువులాగా నన్ను ఆదరించి అక్కునచేర్చుకున్నది బైరాగి కవిత్వం, ముఖ్యం, ఆగమగీతి. నేనెన్నిసార్లైనా చెప్పేమాట, ఆ వాక్యాలు నా రక్తంలో భాగమైపోయాయి అనేది. శ్రీ శ్రీ పరిచయం చేసిన ప్రపంచానికి వెడల్పు ఎక్కువ, బైరాగి వల్ల ఆ ప్రపంచం లోతు కూడా నాకు తెలిసింది. అతడివల్లనే నేను షేక్స్పియర్ నీ, డాస్టొవిస్కీని, ఇలియట్ నీ, రిల్కనీ చదువుకున్నాను. అతడి ‘అర్జున విషాద యోగం’ అర్థం చేసుకోవడానికే భగవద్గీత, మహాభారతం చదువుకున్నాను. అతడి ‘నూతిలో గొంతుకలు’ బోధపడటానికే, కిర్క్ గార్డ్ నీ, తక్కిన అస్తిత్వవాద రచయితల్నీ అధ్యయనం చేసాను. బైరాగి వల్లనే అజంతా, మో, త్రిపుర వంటి రచయితల్ని నేను అర్థం చేసుకోగలిగాను, వాళ్ళ స్నేహంకోసం పరితపించాను. ఒక్కమాటలో చెప్పాలంటే, బైరాగి వల్లనే నేను జీవితాన్ని వదులుకోలేకపోయాను.

ముత్యాలసరాలు

గురజాడని నేను చాలా ఆలస్యంగా అర్థం చేసుకోగలిగాను. కన్యాశుల్కం రాసిన గురజాడ కాదు, ముత్యాలసరాల గురజాడ. శ్రీ శ్రీ, బైరాగి ల్ని చదివాక, గురజాడని మళ్ళీ మళ్ళీ చదివాను. అప్పుడు, ఆ ముగ్గురూ కలిసి, నా ఆధునిక కవిత్రయమని నేను పోల్చుకోగలిగాను. గురజాడ తనతో తాను ఏ యుద్ధం చేసుకున్నాడో మనకు తెలియదు. కాని, యుద్ధానంతర శాంతితో ఒక ఋషిలాగా మనముందు నిలబడతాడు. సమరరహితసమాజం వైపు చేయిచూపిస్తాడు. బైరాగి తన బాహ్యజీవితంలో ఏ యుద్ధమూ చెయ్యలేదు. పూర్తినిస్సంగుడిగా బతికాడు. కాని, రాజీలేని ఆత్మసంఘర్షణ సాగించాడు. ‘పలాయనం, ఆత్మహననం, కృతకశక్తుల పూజనం’ చెయ్యలేక, తనను తాను కాపాడుకోడానికి కవిత్వం చెప్పుకున్నాడు. శ్రీ శ్రీ ఏకకాలంలో ‘తనకీ, లోకానికీ సామరస్యం కుదిరేదాకా అంతర్ బహిర్ యుద్ధారావం’ చేస్తూనే ఉన్నాడు. గురజాడ, శ్రీ శ్రీ, బైరాగి ల గురించిన ఈ మెలకువ కలగడంతో నా జీవితాన్ని మార్చగల ప్రభావశీల రచయితలు మరెవరూ నాకు అవసరం లేకపోయారు. నా సాహిత్యవిద్యాభ్యాసంలో స్నాతకోత్తరదశలోకి అడుగుపెట్టాను.

26-7-2017

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading