ఎప్పటి దృశ్యమో గుర్తు లేదు, బాలమురళి పాడుతున్నాడు:
‘కొమ్మకొమ్మకు ఒకటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా’.
అదే ఆయన్ని మొదటిసారి చూడటం, ఆ గొంతు వినడం.
ఆ తర్వాత, కాకినాడ ఫిల్మ్ క్లబ్ లో హంసగీతె చూసిన జ్ఞాపకం. 75 లోనో, 76 లోనో.
‘చింతా నాస్తికిలాం, తేషామ్ చింతా’
ఆ తరువాత, 80 లు మొదలయ్యాయి. మా పల్లెటూరులోకూడా టేప్ రికార్డరు అడుగుపెట్టింది. భద్రాచల రామదాసు కీర్తనలతో బాలమురళి కూడా మా అడవుల్లోకి అడుగుపెట్టాడు:
‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ..’
కాని మొదటిసారి ఆయన త్యాగరాయకీర్తనలు విన్నది రాజమండ్రిలోనే. ముఖ్యంగా పంచరత్న కీర్తనలు:
‘ఎంతో దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా’
ఉత్సవ సంప్రదాయ కీర్తనలు కూడా.
‘హెచ్చరికగా రార హే రామ చంద్రా, హెచ్చరికగా రార హే సుగుణ సాంద్ర’
కర్నూలు వెళ్ళినకొత్తలో మంత్రాలయం లో కొన్న కేసెట్, ఆ తర్వాత కర్నూల్లో ఎన్నో ప్రభాతాలు నన్ను నిద్రలేపిన కీర్తన.
‘మేలుకో గురురాజ, మేలుకో రవితేజ, మేలుకో శ్రీ రాఘవేంద్ర’
కాని ఎన్నటికీ మరవలేనివి అష్టపదులు, ఎన్నో వానాకాలపు రాత్రుల్లో, వేసవిరాత్రుల వెన్నెల్లో ఎన్నో అడవిదారుల్లో నాతో ప్రయాణించిన పాటల పడవలు:
‘ప్రలయపయోధి జలే, ధృతవానసి వేదం
విహితవహిత్ర చరిత్రమఖేదం’
‘ప్రియే చారుశీలే, ముంచమయి మానం అనిదానం
సపది మదనానలో దహతి మమమానసం దేహి ముఖకమల మధుపానం’
‘కాపి మధురిపుణా విలసతి యువతిరధిక గుణా’
‘సఖి హే కేశిమథన ముదారం
రమయ మయా సహ మదనమనోరథ భావితయాసవికారం’
నిర్వచించలేని ఆయన తిల్లానాలు..
ఒకసారి ఆయన, పండిత జస్ రాజ్ తో చేసిన యుగల్ బందీ ఆద్యంతం వినే అదృష్టం కూడా కలిగింది.
ఎవరో అయాచితంగా నాకు అందించిన కానుక, 72 మేళకర్తల్లోనూ ఆయన గానవైభవం.
బాలమురళి పార్థివదేహం ఆయన గానాన్ని మనకి అందించి తన పని తాను పూర్తిచేసుకుంది.
ఆయనా మనతోనే ఉన్నాడు, ఆ పాటలూ మనతోనే ఉన్నాయి.
23-11-2016